ED Summons | ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఈ క్రమంలో మరో ముగ్గురు బాలీవుడ్ ప్రముఖులకు సైతం ఈడీ సమన్లు జారీ చేసింది. బాలీవుడ్ బ్యూటీలు హుమా ఖురేషి, హీనాఖాన్తో పాటు స్టార్ కమెడియన్ కపిల్ శర్మకు తాజాగా నోటీసులు పంపింది. సెప్టెంబర్లో దుబాయిలో జరిగిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ సక్సెస్ పార్టీకి హాజరైనందుకు కపిల్ శర్మకు, యాప్ను ప్రమోట్ చేస్తున్న హుమా ఖురేషి, హీనాఖాన్కు దర్యాప్తు సంస్థ సమన్లు ఇచ్చింది.
అయితే, ఇప్పటికే రణబీర్ కపూర్కు తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా.. నటుడు తనకు రెండువారాల సమయం కావాలని ఈడీని కోరాడు. అయితే, దీనిపై ఈడీ ఇంకా స్పందించలేదు. మహాదేవ ఆన్లైన్ బెట్టింగ్పై విచారణ జరుపుతున్న ఈడీ.. పలువురు బాలీవుడ్ నటులతో పాటు గాయనీ గాయకులపై సైతం దృష్టి పెట్టింది. అయితే, ఫిబ్రవరిలో యూఏఈలో జరిగిన యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకలకు హాజరైన, గాయకులకు సంబంధించిన వివరాలను జాతీయ మీడియాలో వచ్చాయి.
బెట్టింగ్ యాప్పై ఈడీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సైతం విచారణ జరుపుతున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన సౌరభ్ చంద్రఖర్, రవి ఉప్పల్ వీరిద్దరూ మహాదేవ్ బెట్టింగ్ ప్రమోటర్లు, దుబాయి కేంద్రంగా భారత్లో బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బెట్టింగ్ పేరుతూ అక్రమంగా నగదును బదిలీ చేస్తున్నట్లుగా ఈడీ గుర్తించింది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బదిలీ చేసేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్న ఈడీ విచారణలో వెల్లడైంది. విచారణ సమయంలో రూ.417 కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు.