యంగ్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాడు. తాజాగా ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా రూపొందుతున్న మేజర్ అనే సినిమా చేస్తున్నారు . ఫిబ్రవరి 11, 2022న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 120 రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారట. 8సెట్స్ వేశారు. 75లొకేషన్లో షూటింగ్ జరిగింది. మూడు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
అయితే మేజర్ చిత్రంలో అడివి శేష్.. సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శేష్, మేజర్ సందీప్ తల్లిదండ్రుల మధ్య బంధం మరింత లోతుగా మారింది. సామాన్య ప్రజలను కాపాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసిన మేజర్ కు నివాళులు అర్పించడానికి తాజాగా అడివి శేష్ ముంబై చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఈరోజు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ ప్రియమైన కొడుకు జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి తాజ్ మహల్ ప్యాలెస్ని సందర్శించడానికి ముంబైకి వెళ్తారు. ఈ సారి వారితో పాటు శేష్ కూడా వెళ్లడం ప్రత్యేకత సంతరించుకుంది.
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న మేజర్ చిత్రంలో అడివి శేష్, శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ నటించారు.మహేష్బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ‘మేజర్’ను నిర్మిస్తోంది. శ్రీచరణ్ పాకాల స్వరాలందిస్తున్నారు. వంశి పచ్చిపులుసు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.