Mrunal Thakur | ప్రతిభకు సహనం తోడైతే విజయాలకు అడ్డేదీ లేదని నిరూపించిన నాయిక మృణాల్ ఠాకూర్. మనదైన రోజు తప్పక వస్తుందనే ఆమె నమ్మకం నిజమైంది. దక్షిణాదితో పాటు హిందీలోనూ పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నదీ నాయిక. 2012లో సీరియల్ నాయికగా కెరీర్ ప్రారంభించిన మృణాల్… వెండితెరపై గుర్తింపు కోసం దాదాపు పదేండ్లు వేచి చూసింది. ఈ క్రమంలో ఆమె ఎంతో మానసిక సంఘర్షణకు లోనైంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా బాలీవుడ్లో పేరున్న హీరోల సరసన అవకాశాలు అందుకుంది. తెలుగులో ‘సీతారామం’ ఘన విజయం తర్వాత ఆమెకు అంతటా ఆఫర్స్ పెరిగాయి.
ఈ విజయగాథ వెనుక తను పడిన సంఘర్షణను తాజా సోషల్ మీడియా పోస్టులో వెల్లడించిందీ తార. మృణాల్ స్పందిస్తూ…‘నిన్న గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. ఇవాళ సంతోషంగా ఉన్నా. కలిసిరాని కాలాన్ని సహనంతో గడిపా. ప్రతి అవకాశంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించా. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఇలాంటి సంఘర్షణ ఎదుర్కొని ఉంటారు. చాలా మంది బయటకు చెప్పుకోరు. నేను చెబుతా…ఎందుకంటే నా కథ విని కొందరైనా స్ఫూర్తి పొందాలి’ అని చెప్పింది. ప్రస్తుతం హిందీలో ఐదు చిత్రాల్లో నటిస్తున్న మృణాల్ నాని హీరోగా నటిస్తున్న 30వ చిత్రంతో పాటు సూర్య హీరోగా నటిస్తున్న 42వ చిత్రంలో నాయికగా కనిపించనుంది.