Kasthuri | తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ సినీ నటి కస్తూరి (Kasthuri)ని చెన్నై పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెకు చెన్నై ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, అంతకుముందు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను అరెస్ట్కు ముందు కస్తూరి ఖండించారు.
తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ‘నేను పరారీలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి నిజం లేదు. నేను ఎక్కడికీ పారిపోలేదు. ఎక్కడా దాక్కోలేదు. షూటింగ్ కోసం హైదరాబాద్కు వచ్చాను. ఇక్కడ నా ఇంట్లోనే ఉన్నాను. రోజూ షూటింగ్కు వెళ్లి ఇంటికి వస్తున్నాను. నా దగ్గర సెల్ఫోన్ కూడా లేదు. నా లాయర్కు ఇచ్చాను. పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను’ అని కస్తూరి తెలిపారు.
రీసెంట్గా తమిళనాడులోని రాజకీయపార్టీ ‘హిందూ మక్కల్ కచ్చి’ ఏర్పాటు చేసిన సభలో కస్తూరి ద్రవిడ పార్టీలనుద్దేశించి మాట్లాడుతూ.. ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడటం సరికాదంటూ.. తెలుగువారి పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులోని రాజుల అంతఃపురంలో పని చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లను తమిళనాడు స్థానికులుగా భావిస్తూ, బ్రాహ్మణులను మాత్రం పరాయి వాళ్లుగా చూడటం ఏంటని కస్తూరి ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో కస్తూరి వివరణ కూడా ఇస్తూ.. ద్రవిడ పార్టీలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని అన్నారు. తెలుగు ప్రజలను అవమానించడం తన ఉద్దేశం కాదని తెలిపారు. కేవలం బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడటం ఏంటని ప్రశ్నించానని, అంతేతప్ప తెలుగువారిని కించపర్చలేదని చెప్పుకొచ్చారు.
Also Read..
Sri Simha | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. శ్రీ సింహా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు
Medical Student | ర్యాగింగ్ పేరిట మూడు గంటలు నిల్చోబెట్టిన సీనియర్లు.. వైద్య విద్యార్థి మృతి
Ambulance | అంబులెన్స్కు దారివ్వని వ్యక్తి.. రూ.2.5 లక్షల జరిమానా