అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సినీ హీరో చిరంజీవి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై గంటన్నర పాటు చర్చించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలపై జగన్తో చిరంజీవి చర్చించి, పరిష్కరించాలని కోరారు.
గురువారం ఉదయం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి గన్నవరం బయల్దేరారు. అక్కడ ఎయిర్పోర్టులో దిగగానే చిరంజీవిని మీడియా పలుకరించింది. సినీ పరిశ్రమ బిడ్డగా సీఎంతో మాట్లాడుతానని తెలిపారు. జగన్తో భేటీ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని చిరంజీవి చెప్పారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ను చిరంజీవి శాలువాతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ అంశం గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు, హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చులోనే పేదలకు వినోదం అందాలన్నది ప్రభుత్వ వైఖరి అని మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్ను కలవటంపై అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.