అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకుడు. శాలినీ కొండెపూడి, దివ్యశ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్ని పోషించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గోజల మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ ఇటీవలే ‘ఆహా’ ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం సక్సెస్మీట్ను నిర్వహించారు. ఈ సినిమాలో అభినవ్ గోమఠం పండించిన కామెడీ అందరిని ఆకట్టుకుంటున్నదని, ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారని నిర్మాత గోజల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓ మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరో అభినవ్ గోమఠం అన్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తున్నదని ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.