ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదు చేయాలని ఆప్కు నాయకురాలు పోలీసులకు ముంబై ఫిర్యాదు చేసింది. ‘భారతదేశానికి 2014లో స్వాతంత్ర్యం వచ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్ష’ అని కంగనా వ్యాఖ్యానించింది. ఓ జాతీయ స్థాయి న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రీతీశర్మ మీనన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. కంగనా చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఆప్ ఖండిస్తుందన్నారు. భారతీయ శిక్షాస్మృతి 504, 505 అండ్ 124A సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు పేర్కొన్నారు. ఇటీవల కంగనా రనౌత్ పద్మశ్రీ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీతో పాటు పలువురు నాయకులు తప్పుబట్టారు. నెటిజన్లు సైతం ఆమెపై ఫైర్ అవుతున్నారు.