Adipurush | ‘ఆదిపురుష్’ సినిమా సంభాషణల విషయంలో ప్రజల మనసులను నొప్పించినందుకు క్షమాపణలు కోరుతున్నానని చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ గత నెల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో హనుమాన్ పాత్రధారి చేత పలికించిన సంభాషణలు రామాయణ ఇతిహాస ఔన్నత్యానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి.
ఈ నేపథ్యంలో చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. “ఆదిపురుష్’ సినిమాలోని కొన్ని డైలాగ్స్ వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. వారందరికి చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నా. ఆ హనుమంతుడు మనందరిని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే బలాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అని మనోజ్ ముంతాషిర్ శుక్లా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలిపారు.