ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆది కనిపించనున్నారు. మిషా నారంగ్ నాయికగా నటిస్తున్నది. చాగంటి ప్రొడక్షన్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలపై నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ…‘ఆకట్టుకునే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడేలా ఉంటుంది.
దర్శకుడు చెప్పిన కథలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నేర నిర్ధారణ ఎలా చేస్తుందనే అంశం బాగా ఆకట్టుకుంది. ఇప్పటిదాకా వచ్చిన ఏ సినిమా, వెబ్ సిరీస్ను ఈ సినిమా కోసం స్ఫూర్తిగా తీసుకోలేదు. ఆది సాయికుమార్కు సరిపోయే కథ ఇది. సనాతన్ పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. కథలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.
మొదటి చిత్రానికి కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటారు చాలా మంది నిర్మాతలు. కానీ నాకు థ్రిల్లర్ తరహా సినిమాలు ఇష్టం కాబట్టి ఈ మూవీ నిర్మించాను. విడుదలకు సరైన తేదీ కోసం వేచి చూశాం. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలకు కథలు సిద్ధంగా ఉన్నాయి’ అన్నారు.