Aadavallu Meeku Johaarlu |
తారాగణం: శర్వానంద్, రష్మిక మందన్న, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్య, ఝాన్సీ, సత్యకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: తిరుమల కిషోర్
Aadavallu Meeku Johaarlu | కరోనా ప్రభావంతో గత ఏడాదిన్నర కాలం నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం చాలా తగ్గిపోయింది. దాంతో మాస్, యూత్ఫుల్ సినిమాలే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు సానుకూలపడటంతో కుటుంబ కథా చిత్రాల రిలీజ్కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. ఆ కోవలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సకుటుంబ కథా చిత్రమిదని..ఫ్యామిలీ ఎమోషన్స్కు పెద్దపీట వేస్తూ రూపొందించామని ప్రచార కార్యక్రమాల సందర్భంగా చిత్రబృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఎంతవరకు అంచనాల్ని అందుకుందో చూద్దాం..
చిరంజీవి (శర్వానంద్) ఉమ్మడి కుటుంబంలో అల్లారుముద్దుగా పెరుగుతాడు. తల్లితో పాటు నలుగురు చిన్నమ్మలు..వారి కుటుంబ సభ్యులంటే అతనికి ప్రాణం. రాజమండ్రిలో ఓ కల్యాణమండపం నిర్వహించే చిరంజీవి ముప్పైఆరేళ్లు వచ్చినా ఇంకా బ్యాచిలర్గానే మిగిలిపోతాడు. అతని పెళ్లి కోసం కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటాయి. ఓ సందర్భంలో అతనికి ఆద్య (రష్మిక మందన్న) పరిచయమవుతుంది. ఆమెనే పెళ్లాడాలని ఫిక్సైపోతాడు. అయితే ఆద్య తల్లి వకుల (ఖుష్భూ)కు పెళ్లి మీద సదభిప్రాయం ఉండదు. తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు కూతురికి రావొద్దని కోరుకుంటుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఈ రెండు కుటుంబాల మధ్య చిరంజీవి ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు ఎలా సాగాయి? చివరకు ఇరు కుటుంబాల్ని అతను ఎలా ఒప్పించాడన్నదే మిగతా కథ..
ఫ్యామిలీ ఎమోషన్స్కు చక్కటి వినోదాన్ని జోడించి సినిమాలు తీస్తుంటారు దర్శకుడు కిషోర్ తిరుమల. మామూలు కథల్ని కూడా తనదైన సెన్సిబిలిటీస్తో తెరపై అందంగా ఆవిష్కరించడం ఆయన శైలి. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రానికి కూడా ఆయన ఇదే పద్దతిని అనుసరించారు. చిరంజీవి కుటుంబ సభ్యుల పరిచయం..వారు చేసే పెళ్లి ప్రయత్నాలతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ సన్నివేశాల్లో మంచి వినోదం పండింది. చిరంజీవికి ఆద్య పరిచయంతో కథ వేగం అందుకుంటుంది. ఆద్యను ఇంప్రెస్ చేయడానికి చిరంజీవి చేసే ప్రయత్నాలు వినోదాన్ని పంచుతాయి. ప్రేమ, పెళ్లిపై ఆద్యకు స్పష్టమైన అభిప్రాయం ఉండటంతో చిరంజీవి ఆమెను కన్విన్స్ చేయలేకపోతాడు. ఆంతర్వేది టూర్కు వెళ్లిన సందర్భంలో అనుకోకుండా ఆద్యకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు చిరంజీవి. అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా సాగతుంది.
సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్గా ఉంటుందని ప్రచార కార్యక్రమాల్లో చెప్పినట్లుగానే ఆ ఎపిసోడ్ కొత్తగా అనిపించింది. ఎవరూ ఊహించని కామెడీ పంచ్తో ఇంటర్వెల్ పడటం నవ్వుల్ని పంచింది. ద్వితీయార్థంలో కథ మొత్తం మందగమనంలో సాగింది. పెళ్లంటే సదభిప్రాయంలేని ఆద్య తల్లిలో పరివర్తన తీసుకురావడానికి చిరంజీవి కుటుంబం చేసే ప్రయత్నాలతో సెకండాఫ్ను నడిపించారు. పాత్రల మధ్య సరైన సంఘర్షణ లేకపోవడంతో ఆ సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. అయితే సాధారణ సన్నివేశాల్లో కూడా తన కలం బలాన్ని చూపించాడు కిషోర్ తిరుమల. ఆయా సన్నివేశాల కంటే సంభాషణలు బాగున్నాయి కదా అనే భావన కలుగుతుంది. ై ఎలాంటి మలుపులు లేకుండా ైక్లెమాక్స్ ఘట్టాన్ని ముగించారు. సినిమా మొత్తంలో నాయకానాయికల మధ్య బలమైన ఉద్వేగాన్ని పండించిన సన్నివేశాలు లేకపోవడం పెద్ద లోటుగా అనిపిస్తుంది. ప్రథమార్థంలో సునీల్..సెకండాఫ్లో సత్య మంచి వినోదంతో రిలీఫ్నిచ్చారు. రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు ఉండటంతో సన్నివేశాలకు నిండుదనం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఆద్య, చిరంజీవి లవ్ట్రాక్పై మరింత కసరత్తు చేస్తే బాగుండేది.
చిరంజీవిగా శర్వానంద్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. అంతమంది లేడీ ఆర్టిస్టుల మధ్య కూడా తనదైన శైలి ఎమోషన్స్తో శర్వానంద్ ఆకట్టుకున్నారు. ఆద్య పాత్రలో రష్మిక మందన్న అందంగా కనిపించడంతో పాటు మంచి అభినయాన్ని కనబరచింది. ఆమె డబ్బింగ్ కూడా ఎలాంటి దోషాలు లేకుండా పర్ఫెక్ట్గా అనిపించింది. తెరపై అంతా మహిళా పాత్రలే కనిపించినా రాధిక, ఊర్వశిలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. వారు తమదైన అనుభవంతో అద్భుతమైన నటనను కనబరిచారు. కథానాయిక తల్లిగా ఖుష్బూ నటన బాగుంది. ఝాన్సీ పాత్ర నిడివి చిన్నదే అయినా..మెప్పించింది. వెన్నెల కిషోర్, సత్య నవ్వుల్ని పండించారు. మిగతా పాత్రలన్నీ ఫర్వాలేదనిపించాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం బాగుంది. మెలోడీ ప్రధానంగా పాటలు ఆకట్టుకున్నాయి. కథలోని ఫీల్ను ఎలివేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. సుజిత్సారంగ్ సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా అనిపిస్తుంది. నిర్మాణపరంగా ఎక్కడా లోటు కనిపించలేదు. ఉత్తమ నాణ్యతతో సినిమాను తెరకెక్కించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి..కుటుంబ ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పిస్తుంది. అక్కడక్కడా మంచి వినోదం పండింది. ద్వితీయార్థంపై మరింతగా దృష్టిపెడితే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అలరించేది.
రేటింగ్: 2.5/5