‘వైజాగ్ బీచ్ దగ్గర రోడ్షో చేద్దామంటే ఎవరైనా వస్తారా అని సందేహపడ్డాను. కానీ మీ ప్రేమతో నా అంచనాలు తప్పని నిరూపించారు. మీ అందరి అభిమానం పొందిన నేను చాలా అదృష్టవంతుణ్ణి’ అని అన్నారు దుల్కర్ సల్మాన్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సీతా రామం’. హను రాఘవవూడి దర్శకుడు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించారు.
ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖపట్నంలో ఈవెంట్ నిర్వహించారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “మహానటి’ సినిమాతో మీ అందరికి చేరువయ్యాను. ఇక నుంచి తెలుగు సినిమాలు చేస్తూనే ఉంటా. ‘సీతారామం’ అందమైన ప్రేమకావ్యం. ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలిస్తుంది’ అన్నారు. తన కెరీర్లో తొలిసారి కీలకమైన సపోర్టింగ్ రోల్ను చేశానని, తాను సినిమాలో ఏం చేస్తాననేది మిస్టరీగా ఉంటుందని సుమంత్ పేర్కొన్నారు.
చిత్ర కథానాయిక మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ‘తెలుగులో నాకు ఇంతకంటే గొప్ప అరంగేట్రం దొరకదు. ఈ స్థాయిలో అభిమానుల్ని చూడటం ఇదే మొదటిసారి. మీ ప్రియమైన వారు, స్నేహితులతో కలిసి ఈ అందమైన ప్రేమకథను ఆస్వాదించండి’ అని చెప్పింది. వైజాగ్ ప్రజల అభిమానం చూస్తుంటే ఇక్కడే ఓ సినిమా తీయాలనిపిస్తున్నదని తరుణ్భాస్కర్ తెలిపారు.