రంగారెడ్డి, మే 24, (నమస్తే తెలంగాణ) : గ్రామీణ యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించిన తెలంగాణ క్రీడా మైదానాలు రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సిద్ధమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 863 మైదానాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 558 గ్రామపంచాయతీలతోపాటు 305 ఆవాస ప్రాంతాల్లో మైదానాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఆయా గ్రామాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతమైంది. మరో రెండు, మూడు రోజుల్లోగా క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపును పూర్తి చేయాలని కలెక్టర్ అమయ్కుమార్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 409 గ్రామపంచాయతీల్లో మైదానాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసిన సంబంధిత అధికారులు, మిగతా ప్రాంతాల్లో రెండు రోజుల్లోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి క్రీడా మైదానం ఎకరా స్థలంలో ఉండేలా స్థలాలను ఎంపిక చేస్తున్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, లాంగ్జంప్నకు సంబంధించి క్రీడలు ఆడేలా ఈ మైదానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్రీడా మైదానం ఏర్పాటుకు రూ.4లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 2 నాటికి మండలానికి రెండు క్రీడా మైదానాలను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి మండలంలో రెండు మైదానాలను ఎంపిక చేయడంతోపాటు సిద్ధం చేసే ప్రక్రియ తుది దశకు చేరింది. దాదాపు అన్ని మండలాల్లో ఈ నెలాఖరులోగా ఐదారు క్రీడా మైదానాలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఎంపిక చేసే స్థలాన్ని చదును చేయిస్తున్నారు. మరోవైపు మైదానాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా ఆయా గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలను (సుమారు 300) మైదానం బౌండ్రీ చుట్టూ నాటనున్నారు. ఈ మొక్కల్లో నిమ్మ, బాదాం, గుల్మొహర్, కానుగ, తంగేడు, చింత, వెదురు ఉండనున్నవి. నాటిన మొక్కలు బతికేలా ఏడాదిలో 30సార్లు నీటిని మొక్కలకు అందించనున్నారు. క్రీడా మైదానాల ఏర్పాటు నిర్వహణకుగాను ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని కూడా ఇప్పటికే కలెక్టర్ నియమించారు.
క్రీడా మైదానంలో వాలీబాల్ కోర్టును 26 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో అందుబాటులోకి తీసుకురానున్నారు. 10.5 అడుగుల పొడవున్న కర్రను రెండు అడుగుల రెండంగుళాల మేర నేలలో పాతిపెట్టి మిగతా కర్ర పైభాగంలో నెట్ అమర్చనున్నారు. కబడ్డీ కోర్టును 13 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో మట్టితో నింపి, క్రీడాకారులు కిందపడినా గాయాలు కాకుండా కోర్టులను సిద్ధం చేస్తున్నారు. లాంగ్జంప్ పిట్ను 6 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో 0.5 మీటర్ లోతు నుంచి మెత్తటి మట్టిని నింపనున్నారు. క్రీడాకారులు వ్యాయామం చేసేందుకు సింగిల్ లేదా డబుల్ ఇనుప బార్లను ఏర్పాటు చేయనున్నారు.
– నీరజ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీడీ
కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 27లోగా క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇప్పటికే ఎంపిక చేసిన వాటిలో సగానికిపైగా స్థలాలను గుర్తించాం. ఈ నెలాఖరులోగా మండలానికి రెండు చొప్పున మైదానాలను సిద్ధం చేస్తాం.