హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : చట్టసభల్లో ఓబీసీల రిజర్వేషన్లు, కులగణన డిమాండ్లు సాధించే వరకు ఢిల్లీ ని వదిలివెళ్లేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో సోమవారం నిర్వహించిన జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఫూలే చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే బీసీ బిల్లు సాధనకు ఉద్యమిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పుణెలోని పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఓబీసీ ఉద్యోగ నేతలు పాల్గొన్నారు.