IRCTC-Zomato | రైల్వే ప్రయాణికులకు వేడివేడి ఆహారం అందుబాటులోకి తెచ్చేందుకు ఐఆర్సీటీసీ ముందుకు వచ్చింది. ప్రయాణికులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో’తో జత కట్టింది. దీని ప్రకారం ప్రయాణికులు ముందుగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను వారికి అందుబాటులోకి తేవడానికి ‘జొమాటో’తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నది. ప్రస్తుతం ఐదు స్టేషన్లకే పరిమితమైన ఈ ఫెసిలిటీ.. మున్ముందు మరిన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తారని సమాచారం.
ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ సేవల కింద రైల్వే ప్రయాణికులు తమకు ఇష్టమైన, నచ్చిన ఆహారం ఆర్డర్ చేసుకోవచ్చు. జొమాటో సాయంతో వారికి ఆయా రైల్వే స్టేషన్లలో అందిస్తుంది ఐఆర్సీటీసీ. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద ప్రస్తుతం ఢిల్లీతోపాటు ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో జొమాటో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులకు ఎక్కువ ఆప్షన్లతో మెరుగైన ఆహారం అందుబాటులోకి తేవడానికే జొమాటోతో జత కట్టామని ఐఆర్సీటీసీ వివరించింది. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఐఆర్సీటీసీ ప్రత్యేక సర్వీసులు, ఆఫర్లతో ముందుకు వచ్చింది. ప్రత్యేకించి నవరాత్రోత్సవాల్లో ఉపవాసం ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘థాలీ’ అందిస్తోంది ఐఆర్సీటీసీ.
ఐఆర్సీటీసీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో జొమాటో షేర్ రూ.115 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి దూసుకెళ్లినా, అమ్మకాల సెగ తాకడంతో నష్టాల్లోకి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి జొమాటో షేర్ రూ.113.20 వద్ద ముగిసింది. ఐఆర్సీటీసీ స్టాక్ రెండు శాతం నష్టాలతో రూ.700 వద్ద ట్రేడయి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.48 శాతం నష్టంతో రూ.704 వద్ద స్థిర పడింది.