Zomato Net Loss Widens | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫుడ్ సప్లయి అగ్రిగేటర్ జొమాటో సంస్థ నికర నష్టం పెరిగింది. గతేడాది రూ.99.8 కోట్ల నష్టం వాటిల్లితే.. ఈ ఏడాది అది రూ.356 కోట్లకు పెరిగింది. జోమాటో సేవలకు కరోనా ఆంక్షలు ప్రతిబంధకంగా మారాయి. గత నెలలో ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా జొమాటో చేరిన తర్వాత నష్టాల బారిన పడటం ఇదే తొలిసారి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా జొమాటో రూ.844 కోట్లు సంపాదించింది. గతేడాది కేవలం రూ.266 కోట్లతో సరిపెట్టుకుంది. దీని ప్రకారం 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జొమాటో రెవెన్యూ మూడు రెట్లు పెరిగింది. కరోనా రెండో వేవ్లో ఆంక్షలు ఉన్నా ఫుడ్ డెలివరీ బిజినెస్లో గ్రోత్ నమోదైంది.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చులు రూ.1,259 కోట్లు ఖర్చయితే, గతేడాది రూ.383 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. స్థూలంగా ఫుడ్ డెలివరీ బిజినెస్ ఏడాదికేడాది నాలుగు రెట్లు పెరిగి రూ.4,540 కోట్లకు చేరుకున్నది. గతేడాదితో పోలిస్తే ఇది 37 శాతం అధికం. జూలై 23న స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా రూ.1.08 లక్షల కోట్లకు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నది.