న్యూఢిల్లీ : టెకీల్లోనే కాకుండా వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులనూ లేఆఫ్స్ భయం వెంటాడుతోంది. ట్విట్టర్, మెటా, అమెజాన్ సహా పలు దిగ్గజ టెక్ కంపెనీలు ఇటీవల ఉద్యోగులపై వేటు వేస్తుండగా తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సైతం లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ నుంచి వైదొలగాలని పలు విభాగాలకు చెందిన ఉద్యోగులను జొమాటో కోరింది.
తాజా లేఆఫ్స్లో కంపెనీ ఉద్యోగుల్లో మూడు శాతం మందిని తొలగించనున్నట్టు వార్తలు వచ్చాయి. జొమాటోలో టెక్నాలజీ, ప్రోడక్ట్, మార్కెటింగ్ విభాగాల్లో లేఆఫ్స్ ప్రభావం అధికంగా ఉంటుందని ఓ వార్తాసంస్ధ పేర్కొంది. సహజంగా చేపట్టే ఉద్యోగుల సామర్ధ్యం సమీక్షలో భాగంగానే లేఆఫ్స్ ఉంటాయని కంపెనీ ప్రతినిధి చెప్పుకొచ్చారు.
ఉద్యోగుల్లో 3 శాతం మందినే విధుల నుంచి తొలగిస్తామని అంతకుమించి ఏ ఒక్కరిపై వేటు ఉండదని స్పష్టం చేశారు. కాగా 2020 మేలో జొమాటో సిబ్బందిలో 13 శాతం దాదాపు 520 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో వ్యాపారం దెబ్బతిన్న నేపధ్యంలో అప్పట్లో ఉద్యోగులను తొలగించింది. మరోవైపు కంపెనీలో నాలుగున్నరేండ్ల ప్రస్ధానం అనంతరం జొమాటో సహ వ్యవస్ధాపకులు మోహిత్ గుప్తా తన పదవి నుంచి వైదొలగారు.