న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఎంటర్టైన్మెంట్ సంస్థలు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ), జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ల (జడ్ఈఈఎల్) విలీనానికి వీలుకల్పించే ఒప్పందంపై ఇరు సంస్థలూ సంతకాలు చేశాయి. తమ మధ్య చర్చల ప్రక్రియకు నిర్దేశించిన సమయంలోగా ఇరు కంపెనీలనూ పరస్పరం పరిశీలించడం పూర్తయ్యిందని, దీంతో విలీన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు బుధవారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలూ వాటి నెట్వర్క్స్ను, డిజిటల్ ఆస్తుల్ని, ప్రొడక్షన్ కార్యకలాపాల్ని, ప్రొగ్రామ్ లైబ్రరీలను కలుపుకుంటాయి. ఈ విలీనానికి సంబంధించిన లావాదేవీని సెప్టెంబర్ నెలలో ప్రకటించారు. ఈ డీల్ ప్రకారం సోనీ 1.575 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 12,000 కోట్లు) ఇన్వెస్ట్చేసి, విలీన సంస్థలో 52.93 శాతం వాటాను తీసుకుంటుంది. ఇందులో జీ షేర్హోల్డర్లకు 47.07 శాతం వాటా ఉంటుంది. తాజా ఒప్పందానికి రెగ్యులేటర్లు, షేర్హోల్డర్లు, థర్డ్పార్టీ అనుమతులు లభించాల్సి ఉంది. విలీనమయ్యే కొత్త కంపెనీ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టవుతుంది. ఒప్పందం ప్రకారం జీ ప్రమోటర్లకు నాన్-కంపీట్ ఫీజు కింద సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్లో 2.11 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను ఇస్తారు. అటుతర్వాత విలీన కంపెనీలో ఎస్పీఎన్ఐకి మాతృసంస్థ అయిన సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ 50.86 శాతం వాటాను కలిగిఉంటుంది. జీ ప్రమోటర్ల వద్ద 3.99 శాతం వాటా, ఇతర జీ షేర్హోల్డర్ల వద్ద 45.15 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుత జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునీత్ గోయింకా విలీన కంపెనీకి కూడా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారు. ప్రస్తుత ఎస్పీఎన్ఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎన్పీ సింగ్ విలీన కంపెనీ డైరెక్టర్ల బోర్డులో చేరతారని ఇరు సంస్థల సంయుక్త ప్రకటన తెలిపింది.