Aadhaar – PAN | ప్రతి ఒక్కరూ తమ కుటుంబం, పిల్లల భవిష్యత్ కోసం తమ సంపాదనలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. అలా పొదుపు చేసే చిన్న మొత్తాల పొదుపు పథకాలు (Small Saving Schemes) కూడా ఉన్నాయి. ఈ పథకాల్లో నిధులు మదుపు చేస్తున్న వారు తప్పనిసరిగా ఆధార్ (Aadhar), పాన్ కార్డు (PAN) సబ్మిట్ చేయాలి.ఈ నెలాఖరులోగా వారు తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు 2023 మార్చి 31నే కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గడువులోపు సమర్పించని వారి ఖాతాలను స్తంభింపజేస్తారు. తిరిగి పాన్, ఆధార్ పత్రాలు సమర్పించే వరకూ ఆయా ఖాతాల నిర్వహణ నిలిచిపోవడంతోపాటు లావాదేవీలు జరుపడానికి ఆస్కారం ఉండదు.
చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసిన ఖాతాదారులు ఇప్పటికే పాన్, ఆధార్ సమర్పించి ఉంటే మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారు పాన్, ఆధార్ సమర్పించడం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తప్పనిసరి చేసింది. కనుక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పథకాల్లో కొత్తగా ఖాతాలు ప్రారంభించిన వారు పాన్, ఆధార్ కార్డులు సమర్పించాల్సిన అవసరం లేదు.
చిన్న మొత్తాల పొదుపు పథకాల కిందకు.. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), టర్మ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాస్ పత్ర (కేవీపీ), పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, పోస్టాఫీసు మంత్లీ ఇన్ కం స్కీం, పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (ఏడాది గడువు), పోస్టాఫీసు టైం డిపాజిట్ (రెండేండ్లు), పోస్టాఫీసు టైం డిపాజిట్ (మూడేండ్లు), పోస్టాఫీసు టైం డిపాజిట్ (ఐదేండ్లు) తదితర పథకాలు వస్తాయి.
ఈ పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీరేట్లను సమీక్షిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికం మధ్య కొన్ని పథకాలపై వడ్డీరేట్లు 10-30 బేసిక్ పాయింట్లు పెంచివేసింది. ఎస్సీఎస్ఎస్, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమ్రుద్ధి యోజన వంటి పథకాలపై వడ్డీరేట్లలో ఎటువంటి మార్పు లేదు. పీపీఎఫ్ మీద వడ్డీరేటు 2020 ఏప్రిల్ నుంచి 7.1 శాతంగా కొనసాగుతున్నది.