Kedarnath Yatra | ప్రతియేటా పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లోని భక్తులు దర్శిస్తూ ఉంటారు. చార్ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. హిమాలయ పర్వత శ్రేణుల పరిధిలో 3,553 మీటర్ల ఎత్తున గల కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడం అంత తేలికేం కాదు. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ వరకే వెహికల్స్పై వెళ్లేందుకు చాన్స్ ఉంది. అటుపై మరో 18 కి.మీ. దూరం వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది.
భక్తుల సందర్శనార్థం ఏప్రిల్ 25 నుంచి కేదార్నాథ్ దేవస్థానం తలుపులు తెరుచుకుంటాయని తెలిసింది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి పలువురు వృద్ధులు మొదలు చిన్నారులు, వివిధ అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యేవారు వస్తారు. అటువంటి వారి కోసం ఉత్తరాఖండ్ సర్కార్ తాజాగా హెలికాప్టర్ సర్వీసులు మొదలు పెట్టింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చాక.. చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అధారిటీ (యూసీఏడీఏ) పేరిట ఈ సేవల నిర్వహణకు హెలికాప్టర్ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తుంది. సెలెక్టెడ్ సంస్థలకు మాత్రమే భక్తులకు హెలికాప్టర్ సేవలు అందించేందుకు అనుమతి ఇస్తుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.
కేదార్నాథ్కు హెలికాప్టర్లో వెళ్లాలని భావించే వారు భారతీయ రైల్వేస్ అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీనికోసం ఐఆర్సీటీసీ హెలీ యాత్ర పేరుతో ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అధారిటీ (యూసీఏడీఏ)తో ఐదేండ్ల అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నది ఐఆర్సీటీసీ.
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం కానున్నది. హెలికాప్టర్ల ట్రయల్ రన్స్ మొదలయ్యాయని తెలుస్తున్నది. ఈ నెల 31 వరకు ట్రయల్ రన్స్ ముగుస్తాయి. ఈ హెలికాప్టర్ సర్వీసులు నిర్వహించే సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గైడ్లైన్స్ జారీ చేసింది.
హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్ దేవాలయాన్ని దర్శించాలని భావిస్తున్నవారు తప్పనిసరిగా ఉత్తరాఖండ టూరిజం డెవలప్మెంట్ బోర్డు వద్ద తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే హెలికాప్టర్ సేవలు బుక్ చేసుకోవడానికి చాన్స్ ఉంటుంది. ఆన్లైన్ వెబ్ పోర్టల్లో గానీ, ఉత్తరాఖండ్ టూరిస్ట్ కేర్ యాప్లో గానీ +918394833833 మొబైల్ ఫోన్ నంబర్కు ‘Yatra’ అని వాట్సాప్ మెసేజ్ పంపి కేదార్నాథ్ యాత్ర కోసం తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఒకసారి హెలికాప్టర్ టికెట్ బుకింగ్ సక్సెస్ఫుల్గా పూర్తయితే టికెట్ ప్రింటవుట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఏదైనా ఒక అధికారిక గుర్తింపు కార్డు కూడా చూపాలి.
కేదార్నాథ్ ఆలయం నుంచి 25 కి.మీ.-200 కి.మీ. పరిధిలో వివిధ హెలీప్యాడ్ల నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. గతేడాది డెహ్రాడూన్ నుంచి హెలీకాప్టర్లు నడిపారు. సర్సీ అనే హెలీప్యాడ్.. ఆలయానికి 23 కి.మీ. దూరంలోనే ఉంటది. ఇక్కడి నుంచి 12 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఫటా, గుప్త కాశీ, సీతాపూర్, అగస్త్యముని తదితర ప్రాంతాల నుంచి కూడా గతేడాది హెలీకాప్టర్ సేవలు భక్తులు వినియోగించుకున్నారు. ఇక హెలికాప్టర్పై ఆలయం వద్దకు చేరే భక్తులు కొన్ని స్పెషల్ చార్జీలు చెల్లిస్తే దర్శనంలోనూ ప్రాధాన్యం ఇస్తారు. హెలీకాప్టర్ ద్వారా కేదార్నాథ్ ఆలయ సందర్శనం వల్ల పరమశివుడి దర్శనంతోపాటు హిమాలయ అందాలను సందర్శించే చాన్స్ కూడా ఉంటుందని చెబుతున్నారు.