Xiaomi EV Car SU7 | చైనా టెక్నాలజీ సంస్థ షియోమీ.. ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి ఎంటరవుతోంది. ఈ నెల 28న చైనాలో తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఎస్యూ7’ ఆవిష్కరించనున్నది. ఈ సంగతి షియోమీ సీఈఓ లీ జున్ తెలిపారు. ‘బెస్ట్ లుకింగ్, తేలిగ్గా డ్రైవింగ్ చేయగల స్మార్టెస్ట్ కారు’ ఇది అని చెబుతోంది. దీని ధర 69,424 (సుమారు రూ.58 లక్షలు) డాలర్లు పలుకుతుందని చెబుతున్నారు. గురువారం అధికారిక ధర వెల్లడిస్తామని లీజున్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా ప్రకటించారు.
గత డిసెంబర్ లోనే ఆవిష్కరించినా ఈ నెల 28 నుంచి చైనాలో ముందస్తు బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఆ సందర్భంగా షియోమీ ఈ కారు ధర అధికారికంగా ప్రకటించనున్నది. ఎస్యూ7 కారు తయారీలో టెస్లా, పోర్చే విద్యుత్ కార్లలో కంటే మెరుగైన టెక్నాలజీ వినియోగించినట్లు షియోమీ తెలిపింది. రెండు వర్షన్లలో వస్తున్న ఎస్యూ7 కారు.. ఒక వర్షన్ సింగిల్ చార్జింగ్ చేస్తే 668 కి.మీ, మరో వర్షన్ 800 కి.మీ వరకూ ప్రయాణిస్తుంది.
స్మార్ట్ ఫోన్ల మార్కెట్ స్థిరీకరణ స్థాయికి చేరుకుంటుండటంతో షియోమీ క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి ఎంటరవుతున్నది. వచ్చే పదేండ్లలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. షియోమీ డిజైన్ చేసే ఈవీ కార్లను చైనా ప్రభుత్వ రంగ సంస్థ బీఏఐసీ తయారు చేస్తుంది.