న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత ఆర్థిక వ్య వస్థ వృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ భారీగా తగ్గించింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది జూన్లో వెల్లడించిన 7.5 శాతం అంచనాల్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ల వార్షిక సదస్సులు ప్రారంభంకానున్న సందర్భంగా దక్షిణాసియా వృద్ధి అవకాశాలపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇతర దేశాలతో పాటు భారత్ జీడీపీ వృద్ధి సైతం క్షీణిస్తుందని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందగిస్తున్న సంకేతాలు ఈ సంవత్సరం మధ్యలో వెలువడటం మొదలయ్యిందని ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా చీఫ్ ఎకానమిస్ట్ హాన్స్ టిమ్మర్ చెప్పారు. ఈ క్యాలండర్ సంవత్సరం ద్వితీయార్థంలో పలు దేశాల ఆర్థిక స్థితి బలహీనంగా ఉంటుందని, భారత్ది సైతం దిగజారుతుందని అన్నారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయని, ధనిక దేశాల్లో వృద్ధి నెమ్మదించడం ఒకటికాగా, కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తూ వడ్డీ రేట్లను పెంచడం మరొకటి అని వివరించారు. వడ్డీ రేట్ల పెరుగుదల ఫలితంగా వర్థమాన దేశాల నుంచి మూలధన నిధులు తరలివెళిపోతాయన్నారు. భారత్కు ఉన్న ప్రధాన రిస్క్ కమోడిటీల ధరలు పెరగడమేనన్నారు.
భారత్ వృద్ధి విస్త్రతంగా లేదు
భారత్ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కీలకమైన ఆందోళనకరమైన అంశాలున్నాయని టిమ్మర్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలకంటే వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నట్టు కన్పిస్తున్నా, ఈ వృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఒక చిన్న భాగానికే పరిమితమయ్యిందని, విస్త్రతస్థాయిలో లేదన్నారు. దేశమంతటా, అన్ని రంగాల్లో వృద్ధి వ్యాప్తిచెందకపోతే, కుటుంబాలన్నింటి ఆదాయం పెరగబోదని హెచ్చరించారు. కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం 20 శాతమే ఉందని, ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందని అన్నారు.
ప్రజలు ఆదాయాన్ని ఆర్జించే సాధనాల్ని భారత ప్రభుత్వం అందించాలని సూచించారు. కొవిడ్ షాక్, ఉక్రయిన్లో యుద్ధం, అధిక కమోడిటీ ధరలు వంటి షాక్స్ ఒకదాని తర్వాత మరోటి వెంటవెంటనే వచ్చాయని, వీటిని ఎదుర్కొనేందుకు భారత్ ప్రభుత్వంగానీ, ప్రజలుగానీ సంసిద్ధంగా లేరని, ఆర్థిక వ్యవస్థలో కొద్ది మంది ప్రజలు మాత్రమే పాలుపంచుకోవడం ఇందుకు కారణమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద కంపెనీల పట్ల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద దృష్టి ఉంటుందని, ఇది చాలదని, ఆర్థిక వ్యవస్థలో మరింతమంది ప్రజల్ని భాగస్వాముల్ని చేయడమే ముఖ్యమని టిమ్మర్ వివరించారు.
మాంద్యం ముంగిట్లో ప్రపంచం: ఐఎంఎఫ్
వాషింగ్టన్: ప్రపంచం మాంద్యంలోకి జారుకునే రిస్క్ పెరిగిందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలైన తర్వాత ఐఎంఎఫ్ తరచూ ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంచనాల్ని తగ్గిస్తూ వస్తున్నది. ఇప్పటికే పలు దేశాలు వాటి ఆర్థిక వ్యవస్థలపై యుద్ధం కల్గిస్తున్న ప్రతికూల ప్రభావాల్ని చవిచూస్తున్నాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవియా గురువారం జార్జ్టన్ యూనివర్సిటిలో సభికులకు చెప్పారు. ఇప్పటివరకూ తాము మూడు దఫాలు ఆర్థికాభివృద్ధి అంచనాల్ని తగ్గించామన్నారు.
2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 3.2 శాతానికి పరిమితమవుతుందని, 2023లో వృద్ధి 2.9 శాతమే ఉంటుందని ప్రస్తుతం తాము అంచనా వేస్తున్నామన్నారు. 2026కల్లా 4 ట్రిలియన్ డాలర్ల మేర ఆర్థికాభివృద్ధి తగ్గుతుందని చెప్పారు. ప్రపంచ ఆర్థికంలో మూడో వంతు భాగం కలిగిన దేశాల వృద్ధి ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం వరుసగా కనీసం రెండు త్రైమాసికాలు మైనస్లోకి జారుకుంటుందని జార్జీవియా హెచ్చరించారు. వరుసగా మూడు త్రైమాసికాల్లో ప్రతికూల వృద్ధి నమోదైతే మాంద్యంగా పరిగణిస్తారు.