రియో డీ జనిరో, జూన్ 8: పెరిగిన ఇంధన ధరలతో విమానయాన సంస్థలు.. టికెట్ చార్జీలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే చార్జీలు పెరిగితే ప్రయాణి కులు తగ్గిపోయే వీలున్నదని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ప్రధాన ఆర్థికవేత్త మ్యారీ ఓవెన్స్ థామ్సన్ అభిప్రాయపడ్డారు. ధరల వ్యత్యాసాలు ప్రయాణికుల ప్రత్యామ్నాయాల అన్వేషణకు దారితీస్తాయన్నారు. అమెరికా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది సహజంగానే భారత్ వంటి క్రూడాయిల్ దిగుమతి దేశాలను అన్ని రకాలుగా దెబ్బతీస్తున్నది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విమాన ఇంధనం రేటు 70 శాతం వరకు పెరుగవచ్చన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఐఏటీఏ పైవిధంగా స్పందించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 370కిపైగా ఎయిర్లైన్స్కు ఐఏటీఏ ప్రాతినిధ్యం వహిస్తున్నది.
విమాన టికెట్ ధరల పెంపు అనివార్యంగానే కనిపిస్తున్నదని ఐఏటీఏ చీఫ్ ఎకనామిస్ట్ థామ్సన్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చార్జీలను పెంచకపోతే నష్టాలపాలయ్యే వీలున్నదని, చివరకు దివాలా తీసే ప్రమాదం కూడా లేకపోలేదని వ్యాఖ్యానించారు. అయితే టికెట్ ధరలు పెరిగితే ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యానికి చేరుకోవాలని చూస్తారని, ఇది కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపగలదని కూడా పేర్కొన్నారు. ఇక 2025తో పోల్చితే 2026లో విమానయాన సంస్థల ఇంధన ఖర్చులు 252 బిలియన్ డాలర్ల నుంచి 350 బిలియన్ డాలర్లకు పెరిగిపోవచ్చని చెప్పారు. కేవలం గల్ఫ్ యుద్ధం దెబ్బకు దాదాపు 40 శాతం అధికమయ్యే అవకాశాలున్నాయన్నారు. గత ఏడాది బ్యారెల్ విమానయాన ఇంధనం ధర సగటున 90 డాలర్లుగా ఉంటే.. ఈ ఏడాది అది 152 డాలర్ల స్థాయిలో ఉన్నదని వివరించారు.
పెరుగుతున్న ముడి చమురు ధరలతో ఇప్పటికే దేశీయ విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఎయిర్ ఇండియా మరికొన్ని సంస్థలు ఆయా మార్గాల్లో విమానాల సంఖ్యను తగ్గించేశాయి. ఈ క్రమంలో ఇంధన ధరలు ఇంకా పెరిగితే ప్రధాన మార్గాల్లో తప్ప మిగతా రూట్లలో విమానాల రాకపోకలు నిలిచిపోయే అవకాశాలూ లేకపోలేదన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్ సంస్థలు ఐఏటీఏలో భాగంగానే ఉన్నాయి.