Wipro Policy | ఇచ్చిన ఆఫర్ లెటర్లను నిన్న క్యాన్సిల్ చేసిన విప్రో సంస్థ.. ఇవాళ వర్క్ఫ్రం హోం పాలసీకి మంగళం పలికింది. వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని ఉద్యోగులకు హుకూం జారీ చేసింది. విప్రో యాజమాన్యం తీరుతో పలువురు ఉద్యోగులు మండిపడుతుండగా.. ఆఫర్ లెటర్స్ తిరస్కరణకు గురైన వారు ఐటీ ప్రొఫేషనల్స్ ఫోరం సాయంతో ఆందోళనకు సిద్ధమయ్యారు.
అంతర్జాతీయ టెక్ దిగ్గజం విప్రో.. వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీకి మంగళం పలికింది. ఉద్యోగులంతా కార్యాలయాలకు తిరిగి రావాలని ఆదేశించింది. వారానికి 3 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలని కంపెనీ సూచించింది. ఈ కొత్త వర్కింగ్ ఫ్రం ఆఫీస్ పాలసీ ఈ నెల 10 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించాయి. విప్రో కూడా గత రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగులతో పనిచేయిస్తున్నది. అయితే, కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గిపోవడంతో ఇక ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే పనిలో పడింది. వారంలో మూడు రోజులుగా వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీని అమలుచేస్తున్నట్లు విప్రో ప్రకటించింది. దేశంలోని అన్ని విప్రో కార్యాలయాలు వచ్చే వారం నుంచి వారంలో నాలుగు రోజులు తెరిచి ఉంటాయని తెలిపింది.
వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీకి సంబంధించిన తమ ఉద్యోగులకు ఇంటర్నల్ నోట్గా ఈమెయిల్ ద్వారా పంపింది. ఉద్యోగులంతా సోమవారం, మంగళవారం, గురువారాల్లో తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సి ఉంటుందని ఆ లేఖలో తెలిపింది. ఒకేసారి వర్క్ఫ్రం హోంకు పిలిస్తే ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుందని భావించి తొలుత వారంలో మూడు రోజులు మాత్రమే ఆఫీసుకు రావాలని చెప్తున్నాం అని విప్రో అధికార ప్రతినిధి ఒకరు తెలపారు. కొన్ని వారాల క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా వారంలో మూడు రోజుల వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీని ప్రకటించింది.