న్యూఢిల్లీ, మార్చి 21: దేశీయ డీజిల్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. లీటర్పై పన్నును రూపాయికి తీసుకెళ్లింది. ఇంతకుముందు 50 పైసలుగా ఉన్నది. అయినప్పటికీ విమానయాన ఇంధనం ఎగుమతిపై ఎటువంటి పన్నూ లేదని స్పష్టం చేసింది. ఇదిలావుంటే ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువు ఉత్పాదక దిగ్గజం ఓఎన్జీసీ వంటి సంస్థలు దేశంలో ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీని కేంద్రం తగ్గించింది. టన్నుకు రూ. 3,500లుగా నిర్ణయించారు. ఇది రూ.4,400 లుగా ఉండేది. కాగా, ఈ మార్పులన్నీ మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పన్ను రేట్లను ప్రతీ 15 రోజులకోసారి కేంద్ర ప్రభుత్వం సవరిస్తున్నది తెలిసిందే. గడిచిన రెండు వారాల్లో చమురు ధరల సగటు ఆధారంగా మారుస్తున్నది. నిరుడు జూలై 1 నుంచి కేంద్రం ఈ ట్యాక్స్ను వేస్తున్నది తెలిసిందే. కాగా, ప్రస్తుతం భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, నయరా ఎనర్జీలు ప్రధాన ఇంధన ఎగుమతిదారులుగా ఉన్నారు.