న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు గట్టిగా తగిలింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం అంతక్రితం జూన్ క్వార్టర్కంటే 24 శాతం పడిపోయింది. ఏప్రిల్-జూన్లో రూ.17,955 కోట్ల నికరలాభాన్ని ఆర్జించిన రిలయన్స్ తాజా త్రైమాసికంలో రూ.13,656 కోట్లతో సరిపెట్టుకుంది.
ఈ ఏడాది జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ల ఎగుమతులు, క్రూడ్ ఉత్పత్తిపై వచ్చే లాభాల మీద కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ విధించిన సంగతి తెలిసిందే. రిఫైనింగ్ మార్జిన్లు తగ్గడం కూడా లాభాల క్షీణతకు దారితీసింది. ముగిసిన త్రైమాసికంలో రూ.4,039 కోట్ల మేర విండ్ఫాల్ టాక్స్ భారం పడిందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఆదాయం 32.4 శాతం వృద్ధిచెంది రూ. 2,53,497 కోట్లకు చేరింది.
రిలయన్స్ జియో సెప్టెంబర్ త్రైమాసికానికిరూ.4,518 కోట్ల నికర లాభాన్ని గడించింది. నిరుడుతో పోలిస్తే ఇది 28 శాతం అధికమని పేర్కొంది. ఆదాయం 20 శాతం అధికమై రూ.22,521 కోట్లకు చేరుకున్నది.
రిలయన్స్ రిటైల్ పన్నుకు ముందు లాభం 51% వృద్ధితో రూ. 4,404 కోట్లకు చేరింది. 751 కొత్త స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం అవుట్లెట్స్ సంఖ్య 16,617కు చేరింది.