SEBI Chairman | స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) చైర్మన్ అజయ్త్యాగి పదవీ కాలం సోమవారంతో ముగియనున్నది. కేంద్రం ఆయనను ఆ పదవిలో కొనసాగించనున్నదా.. లేదా.. కొత్త చైర్మన్ను నియమిస్తుందా? అన్న విషయమై ప్రకటన రాలేదు. ఒకవేళ కొత్త నిపుణుడ్ని నియమించాలన్న అందుకు నాలుగు నెలల టైం పడుతుంది. అయితే, సెబీ చైర్మన్గా అజయ్ త్యాగి కొనసాగింపునకు అర్హుడేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. ఇటీవలి వరకు తనకు సెబీ చైర్మన్గా కొనసాగింపు లభిస్తుందని అజయ్ త్యాగి ఆశించారు. కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో స్కాంతో పరిస్థితి తారుమారైందని సమాచారం. అయితే, ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్.. సెబీ చైర్మన్గా అజయ్ త్యాగి రాకముందు జరిగింది కావడం గమనార్హం.
2017లో మూడేండ్ల పదవీ కాలానికి సెబీ చైర్మన్గా అజయ్ త్యాగి నియమితులయ్యారు. కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరిలో తొలుత ఆరు నెలలు, ఆగస్టులో 18 నెలల పొడిగింపు ఇచ్చారు. ఆయన హిమాచల్ ప్రదేశ్కు చెందిన క్యాడర్ ఐఏఎస్.
గతేడాది అక్టోబర్ 28న నూతన చైర్మన్ నియామకానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పదవి కోసం ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి దేబాశిష్ పాండా, ప్రస్తుత రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థికశాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఐఎఫ్ఎస్సీ అథారిటీ చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్, సెబీ మాజీ పూర్తికాల సభ్యుడు మధాబి పూరి బుచ్ పోటీ పడుతున్నారు.