MNCs | హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), వాటికి అనుబంధంగా కొనసాగుతున్న అనేక సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) భవితవ్యంపై ఉత్కంఠ నెలకొన్నది. ఎంఎన్సీల వల్ల భూతద్దం పెట్టి వెదికినా ఎటువంటి ఉపయోగం కనిపించడంలేదని ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతామంటున్న నూతన పారిశ్రామిక విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
రాష్ట్రంలో ప్రస్తుతం అనేక ప్రభుత్వరంగ సంస్థలు, ఎంఎన్సీలకు అనుబంధంగా వేల సంఖ్యలో ఎంఎస్ఎంఈలు మనుగడ సాగిస్తున్నాయి. తెలంగాణలో వివిధ రంగాల్లో వందల సంఖ్యలో ఎంఎన్సీలు, వాటికి అనుబంధంగా వేల సంఖ్యలో ఎంఎస్ఎంఈలు కొనసాగుతున్నాయి. గత పదేండ్ల కేసీఆర్ పాలనలో వందల సంఖ్యలో ఎంఎన్సీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. చర్లపల్లి, బాలానగర్, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని చాలావరకు ఎంఎస్ఎంఈలు ఆయా ఎంఎన్సీలకు అనుబంధంగా కొనసాగుతున్నవే.
నూతన పారిశ్రామికంపై సర్వత్రా ఆసక్తి
ఈ నేపథ్యంలో ఎంఎన్సీల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, తాము ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు త్వరలో ఒక నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ విధానం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైన విధానంగా పేరుగాంచింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విధానం ఇంతకన్నా మెరుగ్గా ఉంటుందా? ఒకవేళ ఉంటే అందులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించనున్నారు? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఎంఎన్సీల పట్ల రాష్ట్ర వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.
ఎంఎన్సీల భవితవ్యంపై ఉత్కంఠ
ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. వాస్తవానికి ఉపాధి అవకాశాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే పైచేయి అనడంలో సందేహం లేదు. అయితే, చాలావరకు ఎంఎస్ఎంఈలు ఎంఎన్సీలపైనే ఆధారపడుతున్నాయి. ప్రభుత్వ వైఖరి, పారిశ్రామిక విధానాలు, ముఖ్యంగా పాలకులపై విశ్వాసం కలిగితేనే కొత్త పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన పారిశ్రామిక అనుకూల విధానాలతో తెలంగాణపట్ల పరిశ్రమ వర్గాల్లో సానుకూల దృక్పథం ఏర్పడింది. దీంతో చాలా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి.