న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సిద్ధమవ్వండి. ఈ నెల 11 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను రెండో విడుత (సిరీస్ 2) సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీం మొదలు కాబోతున్నది మరి. సెప్టెంబర్ 11 నుంచి 15 మధ్య ఈ బాండ్ల పథకం కోసం సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ పూచీకత్తు ఉండే ఈ గోల్డ్ బాండ్ల ధరను ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. ఈ ఏడాది జూన్ 15న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మలి విడుత ఎస్జీబీ స్కీంను ప్రకటించిన విషయం తెలిసిందే.
పేపర్ గోల్డ్లో పెట్టుబడికున్న ప్రభావవంతమైన మార్గాలు, లాభదాయక అవకాశాలు ఈ ఎస్జీబీ స్కీములేనన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పసిడిపై మదుపు చేయాలనుకునేవారు కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం తెలివైన పనేనని సూచిస్తున్నారు. అంతేగాక మదుపరులు తమ పోర్ట్ఫోలియోలో బంగారానికి 8-12 శాతం కేటాయించవచ్చనీ చెప్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తున్నది. భౌతిక బంగారం కొనుగోళ్లకు దీన్నో ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. 2015 నవంబర్లో ఈ ఎస్జీబీ స్కీం పరిచయమైంది. భౌతిక బంగారానికి ఉన్న డిమాండ్ను తగ్గించడమే ఈ ఎస్జీబీల లక్ష్యం. అంతేగాక నేరుగా బంగారం కొనుగోళ్ల ద్వారా వృథాగా మారిపోతున్న నగదును.. ఎస్జీబీల ద్వారా ఫైనాన్షియల్ సేవింగ్స్కు మళ్లిస్తున్నారు. కొన్న బంగారం అదే రూపంలో ఇంట్లోనో, బ్యాంకు లాకర్లలోనో ఉండిపోతుంది. కానీ గోల్డ్ బాండ్స్ పెట్టుబడులు రకరకాల రంగాల్లోకి వెళ్లి సంపద సృష్టికి దోహదం చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
‘భౌతిక బంగారాన్ని (నగలు, నాణేలు, కడ్డీలు) ఆర్థికేతర ఆస్తిగా చూస్తారు. అందువల్ల కొన్న మూడేండ్లలోపు అమ్మేస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును, మూడేండ్ల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులు మార్కెట్లో ఉండే బంగారం గరిష్ఠ ధరనుబట్టి ఉంటాయి. అయితే గోల్డ్ బాండ్లకు పన్నుల మినహాయింపు ఉంటుంది. కానీ సెకండరీ మార్కెట్లో మీరు మీ ఎస్జీబీలను అమ్ముకున్నైట్టెతే గరిష్ఠ స్థాయిలో మూలధన లాభాల పన్నును చెల్లించాల్సిందే. ఇక వీటిపై పొందే వడ్డీకి.. మీ ఐటీ శ్లాబు ప్రకారం పన్ను ఉంటుంది.’
– మోతీలాల్ ఓస్వాల్
నోట్: ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను మూడో విడుత (సిరీస్ 3, 2017 అక్టోబర్ 16న జారీ అయ్యాయి) ఎస్జీబీలకు సంబంధించి ముందస్తు ఉపసంహరణల కోసం మదుపరులకున్న గడువు ఈ నెల 16 నుంచి అక్టోబర్ 6. అలాగే 2017 అక్టోబర్ 23న జారీ అయిన నాల్గో విడుత ఎస్జీబీలకు సంబంధించి గడువు ఈ నెల 23 నుంచి అక్టోబర్ 13. 2017 అక్టోబర్ 30న జారీ అయిన ఐదో విడుత ఎస్జీబీలకు సంబంధించి గడువు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 20.