Gold Returns | ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఏయేటికాయేడు బంగారంపై పెట్టుబడులతో గ్యారంటీ రిటర్న్స్ లభిస్తున్నాయి. కానీ, 2023లో మాత్రం స్టాక్ మార్కెట్ల దూకుడుతో బంగారం టార్గెట్ మిస్ అయింది. దేశీయంగా రాజకీయ సుస్థిరత నేపథ్యంలో 2023లో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి.
2023లో బంగారం తులం (24 క్యారెట్స్) ధర రూ.64,460లతో ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2081 డాలర్లు పలికింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ స్టాక్స్ మీద పెట్టుబడులపై 18 శాతం రిటర్న్స్ లభిస్తే, బంగారంపై పెట్టుబడులకు సుమారు 13 శాతం రిటర్న్స్ లభించాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారాన్ని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఎంచుకున్నారు. ఆర్బీఐ సైతం 2023లో 800 మెట్రిక్ టన్నుల బంగారం కొనుగోలు చేయడం ముఖ్యమైన పరిణామం.
నిఫ్టీ-50 ఇండెక్స్లో పెట్టుబడులపై గత పదేండ్లుగా 14 శాతం రిటర్న్స్ వస్తే, గత 20 ఏండ్లలో 14.9 శాతం లాభాలు వచ్చాయి. కానీ, గత రెండు దశాబ్దాల్లో బంగారంపై పెట్టుబడులకు సగటున 11.2 శాతం రిటర్న్స్ మాత్రమే వచ్చాయి. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని నియంత్రించేందుకు బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. కానీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులను బట్టి నిఫ్టీలో పెట్టుబడులపై రిటర్న్స్ వస్తాయి.
అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, గాజాలో హమస్పై ఇజ్రాయెల్ దాడులు, ఆర్థిక మాంద్యం ప్రభావంతో మున్ముందు ఇన్వెస్టర్లకు బంగారం స్వర్గధామంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న వడ్డీరేట్లను ఈ ఏడాది యూఎస్ ఫెడ్ రిజర్వ్ మూడు సార్లు తగ్గిస్తామని చెప్పడంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని బులియన్ విశ్లేషకులు అంటున్నారు.