Sovereign Gold Bonds | పెట్టుబడికి, మనీ పొదుపుకు అత్యుత్తమ సంప్రదాయ మార్గాల్లో బంగారం కొనుగోళ్లు ఒకటి. మహిళలకు బంగారం ఆభరణాలు ఎంతో ఇష్టం.. కానీ ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయడం మాత్రమే కాదు గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టినా రిటర్న్స్ వస్తాయి. దేశీయ అవసరాలకు అత్యధిక శాతం బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దీనికి దిగుమతి సుంకం భారీగా చెల్లించడంతోపాటు వాణిజ్య లోటుకు కారణం అవుతోంది. దీన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సావరిన్ బంగారం బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది.
సావరిన్ గోల్డ్ బాండ్లలో ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక గ్రామ్ నుంచి నాలుగు కిలోల విలువ వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఒకరి కంటే ఎక్కువగా అంటే జాయింట్ ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ అప్లికెంట్ కేవలం నాలుగు కిలోల విలువ గల బాండ్లపైనే పెట్టుబడి పెట్టొచ్చు. ఏదైనా ట్రస్ట్ 20 కిలోల విలువ వరకు బాండ్లు కొనుగోలు చేయొచ్చు.
బంగారం బాండ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఎనిమిదేండ్లు. మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత వచ్చే రిటర్న్స్ మీద పన్ను రాయితీ ఉంటుంది. ఒకవేళ ఐదేండ్ల తర్వాత బాండ్లను విక్రయించారనుకోండి.. అలా వచ్చే లాభాలపై దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల (ఎల్టీసీజీ)పై పన్ను రూపంలో 20.80 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
బంగారం బాండ్లపై పెట్టుబడులు పెట్టడానికి ఆర్బీఐ పలు ఆప్షన్లు కల్పించింది. వివిధ బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజ్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్హెచ్సీఐఎల్)ల్లో ఏదో ఒకదాంట్లో పెట్టుబడి పెట్టొచ్చు. బాండ్ అప్లికేషన్ నింపి సమర్పించిన తర్వాత మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి మీరు కొనుగోలు చేయ తలపెట్టిన బాండ్ విలువ మొత్తం సొమ్ము మీ డీమ్యాట్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఇక సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి పాన్ కార్డు సమర్పించడం తప్పనిసరి.
కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను ప్రారంభించింది. నాడు గ్రామ్ బంగారం ధర 2684. అప్పట్లో బాండ్ కొనుగోలు చేసిన వారికి రూ.50 రాయితీ కూడా కల్పించారు. అలా కొనుగోలు చేసిన బాండ్ విలువ రూ.2634. తాజాగా సోమవారం నుంచి జారీ చేసే బాండ్లపై ఒక గ్రామ్ విలువ రూ.5923. ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికి రూ.50 రాయితీ కల్పిస్తారు. అంటే సావరిన్ గోల్డ్ బాండ్ విలువ రూ.5873కు చేరుతుంది. గత 12 ఏండ్లలో సావరిన్ గోల్డ్ బాండ్లపై రిటర్న్స్ 120 శాతం పెరిగాయి.
బంగారంపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం బెటర్ అని అంటున్నారు కెడియా కమొడిటీ డైరెక్టర్ అజయ్ కెడియా. ధరల్లో అనిశ్చితి, ఒడుదొడుకుల ప్రభావం ఉండదు. సరైన రిటర్న్స్ వస్తాయి. మూడేండ్ల నుంచి ఐదేండ్లలోపు బంగారంపై పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ లభిస్తాయని అజయ్ కెడియా చెప్పారు.