ముంబై, ఫిబ్రవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం ఒక్కరోజే దాదాపు రూ. 4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపో యింది. బీఎస్ఈ సెన్సెక్స్ 60వేల దిగువకు రాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,800 స్థాయిని కోల్పోయింది. ఉదయం ఆరంభం నుంచే మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. దీంతో సెన్సెక్స్ 329, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిలోకే జారుకున్నారు. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 927.74 పాయింట్లు లేదా 1.53 శాతం క్షీణించి 59,744.98 వద్ద ముగిసి మూడు వారాల కనిష్ఠాన్ని తాకింది. ఈ నెల 1 తర్వాత ఈ స్థాయికి సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. నిజానికి ఒకానొక దశలో సెన్సెక్స్ 991.17 పాయింట్లు లేదా 1.63 శాతం దిగజారి 59,681.55 వద్ద నిలిచింది. సెన్సెక్స్లోని మొత్తం 30 షేర్లలో 29 నష్టాలకే పరిమితమయ్యాయి. అంతేగాక బీఎస్ఈలోని 266 స్టాక్స్ 52 వారాల కనిష్ఠ స్థాయికి వచ్చిపడ్డాయి. ఇక నిఫ్టీ సైతం 272.4 పాయింట్లు లేదా 1.53 శాతం పతనమై నాలుగు నెలల కనిష్ఠాన్ని చేరుతూ 17,554.3 వద్ద స్థిరపడింది. సూచీలోని మొత్తం 50 షేర్లలో 47 షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 1.16 శాతం, స్మాల్క్యాప్ సూచీ 1.09 శాతం కోల్పోయాయి. రంగాలవారీగా యుటిలిటీస్ 2.26 శాతం, కమోడిటీస్ 2.15 శాతం, పవర్ 2.09 శాతం, రియల్టీ 1.80 శాతం, ఆర్థిక సేవలు 1.71 శాతం, మెటల్ 1.65 శాతం, ఎనర్జీ 1.53 శాతం మేర క్షీణించాయి.
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు.. మదుపరుల సంపదను అంతకంతకూ దిగజార్చుతున్నాయి. ట్రేడింగ్ జరిగిన గత నాలుగు రోజుల్లో బీఎస్ఈలోని ఆయా కంపెనీల షేర్ల విలువ రూ.6.97 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కచ్ఛితంగా చెప్పాలంటే బీఎస్ఈ మార్కెట్ విలువ ఈ నాలుగు రోజుల్లో రూ.6,97,102.05 కోట్లు హరించుకుపోయింది. దీంతో రూ.2,61,33,883.55 కోట్లకు పరిమితమైంది. బుధవారం ఒక్కరోజు వాటిల్లిన నష్టాలే రూ.3,87,228.19 కోట్లుగా ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి నెల డెరివేటివ్ల గడువు ముగుస్తుండటం కూడా నష్టాలకు దారితీస్తున్నది. ఇక ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,500 పాయింట్లకుపైగానే పడిపోయింది.
ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ గుర్తింపును భారత్ కోల్పోయింది. ఈ రికార్డు బ్రిటన్ వశమైంది. రూపాయి బలహీనం, అదానీ గ్రూప్ షేర్ల నష్టాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వెనుకబడ్డాయి. మరోవైపు ఈటీఎఫ్లు, ఏడీఆర్లు మినహా బ్రిటన్లోని ప్రైమరీ లిస్టింగ్స్ ఉమ్మడి మార్కెట్ విలువ దాదాపు 3.11 ట్రిలియన్ డాలర్లను తాకింది. భారత్తో పోల్చితే ఇది 5.1 బిలియన్ డాలర్లు ఎక్కువ.
స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ సంస్థల షేర్ల పతనం ఆగడం లేదు. బుధవారం గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ 10.43 శాతం పడిపోయింది. ఒకానొక దశలో 11.94 శాతం నష్టపోవడం గమనార్హం. అయితే ఆఖర్లో కోలుకుని బీఎస్ఈలో రూ.1,404.85 వద్ద షేర్ విలువ నిలిచింది. ఇక ఈ ఒక్కరోజే అదానీ సంస్థల మార్కెట్ విలువ మరో రూ.51,294.04 కోట్లు దిగజారింది. హిండెన్బర్గ్ రిపోర్టు విడుదలైన జనవరి 24 నుంచి గమనిస్తే అదానీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.11.5 లక్షల కోట్లు హరించుకుపోయింది.