హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ ( MSME )లు జోరుమీదున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత 13 వేలకుపైగా ఎంఎస్ఎంఈలు రాగా, వాటి ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం వివిధ పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటం కలిసొచ్చింది. పరిశ్రమల శాఖ నివేదిక ప్రకారం రాష్ట్ర ఏర్పాటు తరువాత రూ.10 కోట్లలోపు పెట్టుబడిగల వ్యాపారాలు, పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) స్థాపన అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నది.
నగర శివారు జిల్లాల్లోనే..
ఎంఎస్ఎంఈల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల విషయంలో నగర శివార్లలోని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. ఇక్కడ 25.3 శాతం పరిశ్రమలు ఏర్పాటుకాగా, ఈ జిల్లాలు ఆకర్షించిన పెట్టుబడుల్లో 24.8 శాతం, ఉపాధి కల్పనలో 27.8 శాతం వాటా ఉన్నది. అలాగే 8.4 శాతం పరిశ్రమలతో కరీంనగర్ రెండో స్థానంలో, 6.6 శాతం పరిశ్రమలతో రంగారెడ్డి మూడో స్థానంలో ఉన్నాయి. పెట్టుబడుల విషయానికొస్తే 18.8 శాతం వాటాతో రంగారెడ్డి రెండవ స్థానంలో, 11.6 శాతం వాటాతో సంగారెడ్డి మూడవ స్థానంలో నిలిచాయి. ఉద్యోగావకాశాల్లో 13.9 శాతంతో సంగారెడ్డి, 13.6 శాతంతో రంగారెడ్డి ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.
ఎక్కువగా కుటీర పరిశ్రమలే
యువత, మహిళలు స్వయం ఉపాధి కోసం ఇండ్లలో చిన్నాచితకా యూనిట్లు స్థాపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అప్పడాలు, చిప్స్, పచ్చళ్లు, అగరబత్తులు, సబ్బులు, వాషింగ్ పౌడర్లు, కొవ్వొత్తులు, బేకరీ ఐటమ్స్, డ్రెస్సులు కుట్టడం, డెకరేటివ్ వస్తువుల తయారీ తదితర రూ.5-10 లక్షల పెట్టుబడితో నెలకొంటున్న పరిశ్రమలు ముఖ్యమైనవన్నారు. అలాగే ఫ్యాబ్రికేషన్ వర్క్స్, ప్యాకింగ్, అట్టపెట్టెల తయారీ, ఫీడ్ తయారీ తదితర రూ.10-25 లక్షల వరకు పెట్టుబడిగల పరిశ్రమలు కూడా బాగానే ఏర్పాటయ్యాయి. ఎంఎస్ఎంఈల అభివృద్ధి యాక్టు-2006 ప్రకారం, తయారీ రంగంలో రూ.25 లక్షల వరకు పెట్టుబడులు కుటీర పరిశ్రమల పరిధిలో ఉండగా, రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చిన్నతరహా పరిశ్రమలు, రూ.5 కోట్ల నుంచి పది కోట్ల వరకు మధ్యతరహా పరిశ్రమల పరిధిలో ఉన్నాయి. అలాగే సేవల రంగం పెట్టుబడుల విషయానికొస్తే రూ.10 లక్షల వరకు సూక్ష్మ, రూ.10 లక్షల నుంచి 2 కోట్ల వరకు చిన్నతరహా, రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు మధ్యతరహా పరిశ్రమల పరిధిలో ఉన్నాయి.
పరిశ్రమల శాఖ నివేదిక వివరాలిలా…
మొత్తంమీద 13,379 పరిశ్రమల ద్వారా రూ.18,467 కోట్ల పెట్టుబడులు, 2,43,556 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి.
పెద్ద ఎత్తున ప్రభుత్వం చేయూత
ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా పెద్ద ఎత్తున లభిస్తున్నది. టీఐడియా, టీప్రైడ్ పథకాల కింద రాయితీలు కల్పిస్తున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ప్రాధాన్యతా రంగాలకు రూ.1.22 లక్షల కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించగా, అందులో 28.85 శాతం (రూ.35,197 కోట్లు) ఎంఎస్ఎంఈలు దక్కించుకున్నాయి.