PSU Banks | ముంబై, మార్చి 14: కనీస పబ్లిక్ వాటాపై సెబి నిబంధనలకు అనుగుణంగా ఐదు పీఎస్యూ బ్యాంక్ల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. సెబీ కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్) నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను ఆఫ్లోడ్ చేయాలి. 2023 మార్చి 31నాటికి మొత్తం 12 పీఎస్యూ బ్యాంక్ల్లో నాలుగింటిలో మాత్రమే ఎంపీఎస్ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటా ఉన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో మూడు పీఎస్యూ బ్యాంక్ల్లో పబ్లిక్ వాటా నిర్దేశిత పరిమితికి చేరిందని, మిగిలిన ఐదు బ్యాంక్ల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడానికి కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు జోషి వివరించారు. ప్రస్తుతం కేంద్రానికి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 98.25 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 96.38 శాతం, యూకో బ్యాంక్లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.08 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు 86.46 శాతం చొప్పున వాటా ఉన్నది.