Tata Sons | కార్పొరేట్ ప్రపంచ భవిష్యత్పై టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్లో సంక్లిష్టత 2024లో కొత్త శిఖరాలకు చేరుతుందన్నారు. కొత్త సంవత్సరంలో మరింత అంతరాయం, అనిశ్చితి తప్పవని తన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. 2024లో టాటా గ్రూప్ సంస్థలకు మూడు ప్రాధాన్యాలు నిర్దేశించారు. `విధుల అమలు, కస్టమర్ సంతృప్తి, టెక్నాలజీ` అంశాలు వచ్చే ఏడాది టాటా సన్స్ గ్రూపు పరివర్తనలో కీలకం అవుతుందన్నారు. కస్టమర్లకు అద్భుతమైన అనుభవాలను అందించిన సంస్థలదే వచ్చే దశాబ్ది అని చెప్పారు.
2023 అంతా అల్లకల్లోలంగా సాగిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ముప్పు ఉందంటూనే.. టాటా గ్రూప్ కంపెనీలన్నీ `ఏఐ` ఆర్థిక, నిర్వహణ, సామాజిక లాభాలను అందుకోవడంలో చాంపియన్లుగా నిలవాలని పిలుపునిచ్చారు. మున్ముందు టాటా సన్స్ కన్జూమర్ బిజినెస్ వృద్ధిపై కేంద్రీకరిస్తుందన్నారు. ఎయిర్ ఇండియా మొదలు టాటా మోటార్స్, టైటాన్.. ఏ సంస్థ అయినా అన్ని కంపెనీల్లో టాటా బ్రాండ్కు తప్పనిసరిగా బ్రాండ్ గుర్తింపు తేవాలన్నారు చంద్రశేఖరన్.
2023లో రోజురోజుకు భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోవడం, అస్థిరతా ధోరణులను ప్రపంచ దేశాలు చవి చూశాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. సుస్థిరత దిశగా సామూహిక స్థాయిలో జనరేటివ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అడాప్షన్ పెరిగిందన్నారు. `వీటిలో కొన్ని ధోరణులను స్వాగతించాలి. మరికొన్నింటిని వదిలేయాలి. కానీ అవన్నీ మన సంస్థల పని తీరులో నియమ నిబంధనల రూపకల్పనలో కీలకంగా మారతాయి. ఆయా పద్దతులను అమలు చేసేందుకు మనపై ఒత్తిడి పెరుగుతుంది` అని చంద్రశేఖరన్ చెప్పారు.
2024లో ద్రవ్యోల్బణం కట్టడికి, డేటా ప్రైవసీ పరిరక్షణకు ప్రపంచం కొత్త నియమ నిబంధనలు రూపొందిస్తుంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తలెత్తే ముప్పు` వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు చంద్రశేఖరన్. వచ్చే ఏడాది 40 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో అనిశ్చితి తప్పనిసరిగా ఉంటుందన్నారు.