Nirmala Sitharaman | మోదీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలపై ఆధారపడకుండా సాధికారతపై దృష్టి పెట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆదాయం పన్ను శ్లాబ్ల సవరణ వంటి ప్రజాకర్షక విధానాలపై తమ ప్రభుత్వం ద్రుష్టి పెట్టలేదన్నారు. అయినా ఏప్రిల్ / మే నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటిస్తారని, తమ బడ్జెట్కు ఆమోదం తెలుపుతారని తేల్చి చెప్పారు. అధికార బీజేపీ.. మూడో విడత కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ‘ప్రధాని మోదీపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది. గత పదేండ్లుగా మేం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేశాం. కేవలం ప్రజానుకూల విధానాలు అమలు చేయడమే కాక మా ప్రభుత్వ విధానాలు ప్రతి అర్హుడైన పౌరుడి దరి చేర్చేందుకు మేం కష్టపడి పని చేస్తున్నాం’ అని తెలిపారు.
‘మొదటి సారి, రెండోసారి ప్రజలు మమ్ముల్ని ఆశీర్వదించారు. ఈ సారి కూడా అదే జరుగుతుంది’ అని 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని గుర్తు చేశారు నిర్మలా సీతారామన్. ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలకు విశ్వాసం ఉన్నప్పుడు, ప్రజలకు పథకాలు, ప్రభుత్వం చేపట్టిన అభివ్రుద్ధి పనుల ఫలితాలు చేరినప్పుడు విశ్వాసం పెరుగుతుంది’ అని అన్నారు. ‘ద్రవ్య క్రమశిక్షణ, సబ్సిడీలను అమలు చేస్తున్నాం. కానీ సాంఘిక సంక్షేమానికి పెద్దగా నిధుల కేటాయించక పోవడంపై ఎటువంటి ఆందోళన లేదు’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా మహమ్మారి ఉధృతి వేళ.. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నా.. పేదలందరికీ ఆహారం, నిత్యావసర వస్తువులను ప్రభుత్వం సరఫరా చేసిందని ఆమె పేర్కొన్నారు.