Satilite Internet | టెస్లా సీఈఓ ఎలన్మస్క్ మాత్రం భారత్లో తన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ‘స్టార్లింక్’ సేవలను ప్రారంభించడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. తమ స్టార్ లింక్ సాయంతో మౌలిక వసతులు అంతగా లేని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవచ్చునని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. రెండేండ్ల క్రితం భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించడానికి స్టార్ లింక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించడానికి స్పెక్ట్రం, ఎయిర్వేవ్లకు లైసెన్సు ఇవ్వాలని స్టార్ లింక్ కోరుతున్నది. స్టార్లింక్తోపాటు టాటా, భారతీ ఎయిర్ టెల్ ఆధ్వర్యంలోని వన్వెబ్, ఎల్ అండ్ టీ, అమెజాన్కు చెందిన క్యూపర్ కూడా లైసెన్స్ ఇస్తే చాలునని, వేలం వద్దని అంటున్నాయి.
కానీ భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ముందుకొచ్చే విదేశీ సంస్థలకు స్పెక్ట్రం, ఎయిర్ వేవ్ల కేటాయింపుపై వేలం నిర్వహించాలని ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ కోరుతున్నది. మొబైల్ స్పెక్ట్రం తరహాలోనే శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు వినియోగించే ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ వేలం నిర్వహించాలన్న ప్రతిపాదనపై రిలయన్స్ జియోకు వొడాఫోన్ ఐడియా మద్దతు పలికింది.
స్టార్లింక్, భారతీ ఎయిర్టెల్ వన్వెబ్, అమెజాన్ క్యూపర్ ప్రతిపాదనలకు భిన్నంగా టెలికం రంగ నిపుణులు స్పందిస్తున్నారు. భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రం వేలం ద్వారానే అనుమతి ఇవ్వడం మంచిదని వారంటున్నారు. దేశంలోకి విదేశీ సంస్థల పెట్టుబడులు రావాలంటే శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు వేలం నిర్వహించడమే సరైందని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనివల్ల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ప్రసారమయ్యే కంటెంట్ మీద కొంత నియంత్రణ ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే భారత్లో ఎయిర్ టెల్ వన్ వెబ్ ఇండియా, జియో శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలకు టెలికం శాఖ అనుమతులు ఇచ్చేసినా.. ఇంకా కేంద్రం విధి విధానాలు ఖరారు చేయలేదు. ఈ పరిస్థితుల్లో భారత్లో తమ సేవలు ప్రారంభించాలని భావిస్తున్న విదేశీ సంస్థలు వేలానికి బదులు లైసెన్సులు జారీ చేయాలని కోరుతున్నాయి.