న్యూఢిల్లీ : దిగ్గజ టెక్ కంపెనీలు గత కొద్ది వారాలుగా మాస్ లేఆఫ్స్కు తెగబడటంతో పాటు పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న నేపధ్యంలో వాల్ట్ డిస్నీ సైతం ఇదే బాటపట్టనుంది. దీర్ఘకాలంగా నష్టాలను నమోదు చేస్తున్న క్రమంలో ఖర్చులను నియంత్రించేందుకు వాల్ట్ డిస్నీ ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. సీఈఓ బాబ్ చపెక్ను తొలగించిన కంపెనీ బాబ్ ఇగర్ను తిరిగి సీఈఓగా నియమించింది.
కంపెనీ వ్యాపారాన్ని విస్తరించి లాభాలను పునరుద్ధరించేందుకు వాల్ట్ డిస్నీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా లేఆఫ్స్కు దిగనుందనే వార్తలు ఉద్యోగుల్లో అలజడి రేపుతున్నాయి. 2005లో వాల్ట్ డిస్నీకి సారధ్యం వహించిన ఇగర్ 15 ఏండ్ల పాటు సాగిన తన ప్రస్ధానంలో కంపెనీ పలు మైలురాళ్లను అధిగమించింది.
ఆయన హయాంలోనే మార్వెల్, ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలు, ఇతర వ్యాపారాలను డిస్నీ కొనుగోలు చేసింది. డిస్నీ ప్లస్ స్ట్రీమింగ్ సర్వీసును లాంఛ్ చేయడంలో కూడా ఇగర్ పాత్ర కీలకంగా చెబుతారు. ఇదే సంస్ధ ఆపై భారత్లో డిస్నీ+ హాట్స్టార్గా స్టార్ ఇండియా భాగస్వామ్యంతో సేవలు అందిస్తోంది. ఇగర్ పునర్నియామకంతో మెరుగైన ఫలితాలు, లాభాలు ఆర్జిస్తామని వాల్ట్ డిస్నీ ఆశిస్తోంది.