హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): నిపుణులకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని, రాష్ట్రం నుంచేగాక ఇతర రాష్ర్టాల నుంచీ ఎంతోమంది ఇక్కడకు వచ్చి స్థిరపడుతున్నారని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం ఐటీ కారిడార్లో వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐటీ కార్యకలాపాల నిర్వహణకు హైదరాబాద్ నగరం ఎంతో అనుకూలమైందన్నారు. వీఎక్స్ఐ కార్యకలాపాలను ఇక్కడి నుంచి నిర్వహించేందుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు.
వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జారెడ్ మారిసన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు సేవలు అందించేందుకు హైదరాబాద్ కేంద్రం ఎంతో కీలకంగా ఉంటుందన్నారు. వచ్చే 5 ఏండ్లలో 10వేల మంది ఉద్యోగులను నియమించుకొని మరిన్ని సేవలను అందిస్తామని ప్రకటించారు. 1.20 లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, ఈ ఏడాది చివరినాటికి 1,000 మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమంలో వీఎక్స్ఐ సొల్యూషన్స్ కంపెనీ ప్రతినిధులు ఎరికా, సుబీర్ చక్రవర్తి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.