న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఈవో వేణుగోపాల్ ధూత్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం ఉదయం కొద్ది సమయం పాటు ప్రశ్నించిన అనంతరం ధూత్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. గతవారమే అరెస్ట్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను రిమాండ్ విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు హాజరుపర్చడానికి కొద్ది గంటల ముందే ధూత్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది అనుమానితులపై ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు.
కొచ్చర్లు, ధూత్, దీపక్ కొచ్చర్ నిర్వహించే నుపవర్ రెన్యువబుల్స్ లిమిటెడ్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. బ్యాంకింగ్ నియంత్రణల చట్టం, ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీలను ఉల్లంఘిస్తూ వీడియోకాన్ గ్రూప్కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 3,250 కోట్ల రుణాన్ని మంజూరుచేసిందని సీబీఐ ఆరోపించింది. రుణ మంజూరీకి క్విడ్ప్రోకోగా ధూత్..సుప్రీమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.65 కోట్లు నుపవర్ రెన్యువబుల్స్లోకి 2010-2012 మధ్యకాలంలో నిధులు బదిలీ చేసినట్టు సీబీఐ వివరించింది. కాగా, చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్లను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా డిసెంబర్ 28 వరకూ సీబీఐ కస్టడీకి రిమాండ్ చేసింది.