న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మాస్టర్కార్డ్ ఇండియా చైర్మన్గా రజ్నీశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ గురువారం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్గా ఈయన గతంలో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు మాస్టర్కార్డ్ ఇండియా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆయన ఎన్నికయ్యారు. కాగా, గౌతమ్ అగర్వాల్ నాయకత్వంలోని మాస్టర్కార్డ్ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ బృందానికి రజ్నీశ్ కుమార్ మార్గనిర్దేశం చేయనున్నారని ఓ ప్రకటనలో మాస్టర్కార్డ్ ఇండియా తెలిపింది.
రజ్నీశ్ కుమార్ సారథ్యంలో మాస్టర్కార్డ్ వ్యూహాత్మక భాగస్వామ్యాలు, బ్యాంకులు, ఫిన్టెక్స్, ప్రభుత్వాల పేమెంట్స్ ఎకోసిస్టమ్ మరింత మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా మాస్టర్కార్డ్ ఆసియా-పసిఫిక్ విభాగం అధ్యక్షుడు అరి సర్కార్ వ్యక్తం చేశారు. ఇదిలావుంటే సాంకేతికంగా, సామర్థ్యాలపరంగా, వనరుల దృష్ట్యా ఎంతో బలంగా ఉన్న మాస్టర్కార్డ్.. భారతీయ పేమెంట్స్ వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తున్నదని, ఇందులో తాను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉందని రజ్నీశ్ కుమార్ అన్నారు.