కరోనాపై పోరులో కలిసొస్తున్న కార్పొరేట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: భారత్ను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి కార్పొరేట్లు సాయంగా కదిలివస్తున్నారు. వేదాంత రూ.150 కోట్ల సాయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో వెయ్యి క్రిటికల్ కేర్ బెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలియజేసింది.
కోకాకోలా రూ.50 కోట్లు
కోకాకోలా కొవిడ్ వ్యాక్సినేషన్, సేఫ్టీ కిట్స్ వితరణకు రూ.50 కోట్ల సాయాన్ని ప్రకటించింది. దీనివల్ల కనీసం 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరగలదన్న ఆశాభావాన్ని సంస్థ వ్యక్తం చేస్తున్నది. వైరస్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు ఇస్తామన్న సంస్థ.. వేసవి తాపాన్ని తట్టుకునేలా ఆయా శాఖల సిబ్బందికి డ్రింక్స్నూ సరఫరా చేస్తామన్నది.
ఎస్బీఐ రూ.30 కోట్లు
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ర్టాల్లో మేక్షిఫ్ట్ ఆస్పత్రుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. కొవిడ్ రోగులకు చికిత్స కోసం రూ.30 కోట్లతో ఐసీయూ వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు.