దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాల్పడిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ చట్టాలను అడ్డగోలుగా మార్చారన్న ఆరోపణలు మరోమారు వినిపిస్తున్నాయి. ఓవైపు అదానీ గ్రూప్ బాగోతం నడుస్తుండగానే.. మరోవైపు వేదాంత మకిలీ కేంద్రానికి అంటుకున్నది.
అదానీ అవకతవకలపై హిండెన్బర్గ్ రిపోర్టుకు మద్దతుగా ఓ తాజా నివేదికను తెచ్చిన ఓసీసీఆర్పీ.. కరోనా సమయంలో వేదాంత గ్రూప్ జరిపిన రహస్య లాబీయింగ్, దానికి పర్యావరణ చట్టాల్లో కేంద్రం చేసిన సవరణలపై మరో రిపోర్టును ఇచ్చింది.
Vedanta | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ కార్పొరేట్ల అవినీతి.. అందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వ దుర్నీతిపై గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్వర్క్ ఓసీసీఆర్పీ వరుస నివేదికలు సంచలనం రేపుతున్నాయి. భారత ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రకంపనల్ని సృష్టిస్తున్న ఈ రిపోర్టులు.. మోదీ సర్కారు అసలు రంగును బయటపెడుతున్నాయి. గురువారం అదానీ గ్రూప్ అక్రమాలపై గొంతెత్తిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ).. శుక్రవారం మరో కార్పొరేట్ దిగ్గజం వేదాంత అవకతవకల్ని వెలుగులోకి తెచ్చింది. వాటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏవిధంగా మద్దతు పలికిందో వివరించడం ఇప్పుడు సర్వత్రా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
దేశీయ గనులు, చమురు రంగాల్లో వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత.. కరోనా సమయంలో పలు ప్రధాన పర్యావరణ చట్టాల నిర్వీర్యమే లక్ష్యంగా ‘కోవర్ట్’ లాబీయింగ్ క్యాంపెయిన్ను నడిపిందని ఓసీసీఆర్పీ తమ తాజా రిపోర్టులో పేర్కొన్నది. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం.. సదరు చట్టాల సవరణతో సహకరించినట్టు వెల్లడించింది. వేదాంత గ్రూప్ చమురు వ్యాపార సంస్థ కెయిర్న్ ఇండియా సైతం.. ప్రభుత్వ వేలాల్లో గెల్చుకున్న చమురు క్షేత్రాల్లో చమురు నిల్వల అన్వేషణ కోసం డ్రిల్లింగ్కు పబ్లిక్ హియరింగ్స్ ఉండకుండా (స్థానిక ప్రజల అభిప్రాయాలతో పని లేకుండా) విజయవంతంగా లాబీయింగ్ చేసిందని తెలిపింది. మరోవైపు ఓసీసీఆర్పీ నివేదికను తోసిపుచ్చకుండా వేదాంత గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. భారత జాతి ప్రయోజనాలకు సంస్థ కట్టుబడి ఉంటుందన్నారు.
వేదాంత లాబీయింగ్కు లొంగిపోయిన కేంద్ర ప్రభుత్వం.. చట్ట విరుద్ధమైన పద్ధతులతో ఎవ్వరి అభిప్రాయాలను తీసుకోకుండానే, ఎటువంటి సంప్రదింపులు, చర్చలు లేకుండానే పర్యావరణ చట్టాలను మార్చేసిందని తమ నివేదికలో ఓసీసీఆర్పీ తెలిపింది. తమతో సఖ్యతగాలేని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల్ని నిరాకరిస్తున్న కేంద్రం.. కార్పొరేట్ల లాభాల కోసం మాత్రం పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిసినా క్లోజ్డ్ డోర్ మీటింగుల్లో ఇష్టారాజ్యంగా చట్టాలను సవరించేసింది. ఫలితంగా కరోనా పరిస్థితులనూ తమకు అనుకూలంగా మార్చకున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పరిశ్రమ పెద్దలు కోరగానే రూల్స్ను పాతరేస్తూ నిర్ణయాలను తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారుల రికార్డులే చెప్తున్నాయని ఓసీసీఆర్పీ ధ్వజమెత్తింది.
2021 జనవరిలో వేదాంత గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో మాట్లాడారు. కొత్త పర్యావరణ అనుమతులు లేకుండానే కంపెనీలకు గనుల తవ్వకాలకు వీలు కల్పిస్తే 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచగలుగుతాయన్నారు. దీనివల్ల దేశ జీడీపీ పరుగులు పెడుతుందని చెప్పారు. అంతేగాక పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కూడా వస్తాయని, ప్రభుత్వ ఖజానాకూ భారీగా ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. దీంతో జవదేకర్ వెంటనే ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తన మంత్రిత్వ శాఖ కార్యదర్శికి తగువిధంగా సూచనలు చేశారు. అటవీ శాఖ డైరెక్టర్ జనరల్కూ పర్యావరణ అనుమతుల విధానంపై చర్చ అవసరమని లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే అడ్డగోలుగా పర్యావరణ చట్టాల సవరణ జరిగిపోయింది. తద్వారా అనిల్ అగర్వాల్ తాను కోరుకున్నది సాధించారు.
-తాజా నివేదికలో ఓసీసీఆర్పీ