Nirmala on Rupee | ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎనిమిదేండ్లలో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ 25.39 శాతం పతనమైందని కేంద్రం అంగీకరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2014 డిసెంబర్ 31న రూపాయి విలువ 63.33గా ఉంటే.. ప్రస్తుతం 80కి అటూ ఇటూగా తచ్చాడుతున్నది. రూపాయి పతనంపై సభ్యులు దీపక్ బైజ్, విజయ్ వసంత్ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ నెల 11 నాటికి డాలర్పై రూపాయి 79.41కి పడిపోయిందని అంగీకరించారు.
2014 డిసెంబర్ 31న 63.33గా ఉన్న రూపాయి మారకం విలువ.. 2018 డిసెంబర్ నెలాఖరు నాటికి 69.79కి.. 2019 డిసెంబర్ 31న 70 మార్క్ దాటేసింది. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం తర్వాత 70 మార్కు పైనే కొనసాగుతూ వస్తున్నది. గత నెల 30న డాలర్ విలువ 78.94కు పతనమైందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి క్రూడాయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బిగుసుకుపోవడం తదితర అంశాలు రూపాయి పతనానికి కారణం అని నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 14 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు ఉపసంహరించడం మరో కారణం అని అన్నారు. మన రూపాయి కంటే బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్, ఈయూ యూరో ఎక్కువగా డాలర్పై పతనం అయ్యాయని తెలిపారు.