న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రపంచ దేశాలకు భారీ మొత్తంలో వివిధ రకాల వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్న భారత దేశం ఇప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు తహతహలాడుతున్నది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా, యూరప్, బ్రిటన్, జపాన్ లాంటి దేశాల్లో ఆమోదం పొందిన కొవిడ్-19 వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి శీఘ్రంగా అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా లాంటి విదేశీ కంపెనీల నుంచి కొవిడ్-19 టీకాలను దిగుమతి చేసుకునేందుకు మార్గాన్ని సుగమం చేసింది. కేంద్ర నిర్ణయంతో ఆయా కంపెనీలు తమ వ్యాక్సిన్లకు స్థానికంగా భద్రతా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఈ వెసులుబాటు నేపథ్యంలో ఫైజర్ మళ్లీ భారత్ వైపు చూస్తున్నది. ఫిబ్రవరిలో ఇక్కడ దరఖాస్తును ఉపసంహరించుకున్న ఆ కంపెనీ.. ఇప్పుడు భారత్కు తమ టీకాను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ప్రకటించింది. మరోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న కొవిడ్ టీకా వినియోగాన్ని వెంటనే ఆపేయాలని అమెరికా ఆరోగ్య సంస్థలు బైడెన్ సర్కార్కు సిఫారసు చేశాయి. ఈ టీకా తీసుకున్న 50 ఏండ్లలోపు మహిళల్లో ఆరుగురికి రక్తం గడ్డకట్టినట్టు తేలడమే ఇందుకు కారణం.
5.46 కోట్ల డోసుల అమ్మకం
నిన్న మొన్నటివరకు భారత్ కోట్ల కొలదీ కొవిడ్-19 టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో ఈ టీకాలకు డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. మరోవైపు పలు పేద దేశాలు కరోనా మహమ్మారి బారి నుంచి తమ ప్రజలను కాపాడుకునేందుకు భారత్పైనే ఆధారపడ్డాయి. ఇప్పటివరకు 10.80 కోట్ల కొవిడ్ టీకా డోసులను వినియోగించుకున్న భారత్.. వివిధ దేశాలకు 5.46 కోట్ల డోసులను అమ్మింది. మరో కోటికిపైగా డోసులను భాగస్వామ్య దేశాలకు బహుమతిగా అందజేసింది.
సిప్లా రెమ్డెసివిర్ ఉత్పత్తి రెట్టింపు
ప్రముఖ ఫార్మాసంస్థ సిప్లా రెమ్డెసివిర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 6-7 లక్షల డోసులకు పెంచబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 3 లక్షల డోసులు ఉత్పత్తి చేస్తున్నది. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తిని రెట్టింపు స్థాయిలో పెంచుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గతంలో డిమాండ్ లేకపోవడంతో రెండు యూనిట్లలో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించిన సంస్థ.. మళ్లీ ఉత్పత్తిని అమాంతం పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ అమెరికాతోపాటు 100 దేశాలకు ఈ రెమ్డెసివిర్ను ఎగుమతి చేస్తున్నది.
క్యాడిల్లా కూడా రెమ్డెసివిర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10-12 లక్షల డోసులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ 5-6 లక్షల డోసులను ఉత్పత్తి చేస్తున్నది. డిమాండ్ ఇలాగే ఉంటే త్వరలో కెపాసిటీని 20 లక్షలకు పెంచుతామని తెలిపింది.
ప్రస్తుతం భారత్లో ఏడు ఉత్పత్తి సంస్థలు నెలకు 38.80 లక్షల రెమ్డెసివిర్ డోసులను ఉత్పత్తి చేస్తుండగా.. ఈ సామర్థ్యాన్ని 78 లక్షలకు పెంచడానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.