హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం మరో కీలక ఆవిష్కరణ చేసింది. మహిళల నేతృత్వంలో నడుస్తున్న స్టార్టప్లు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ‘వీ-ట్రేడ్’ పేరుతో కొత్త వేదికను ప్రారంభించింది. వీ-హబ్, సీఐఐ-ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ (ఐడబ్ల్యూఎన్) సంయుక్తంగా వర్చువల్గా ప్రారంభించాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోలేకపోతున్న స్టార్టప్లకు వీ-ట్రేడ్తో ఈ సమస్య తీరిపోతుందన్నారు. సీఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇన్నోవేషన్ చైర్మన్ క్రిష్ గోపాల కృష్ణన్ మాట్లాడుతూ.. స్టార్టప్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.