హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు ట్రూకాలర్తో వి-హబ్ ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో వి-హబ్ సీఈవో దీప్తి రావుల, ట్రూకాలర్ ప్రజా సంబంధాల విభాగం డైరెక్టర్ ప్రగ్యా మిశ్రా సోమవారం ఇక్కడ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు వచ్చే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యం గా స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు వివిధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామన్నారు.