TweetDeck | ఎలన్మస్క్ ఏం చేసినా సంచలనమే.. గతేడాది మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ‘ట్విట్టర్’ను టేకోవర్ చేసినప్పటి నుంచి సమూల మార్పులు చేశారు. చివరిగా ట్విట్టర్ పేరు ‘ఎక్స్’ అని మార్చేశారు. తాజాగా సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ (TweetDeck) సర్వీసులు ఉచితం.. కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. యూజర్లలో మనీ పే చేసిన వారికి బ్లూ సబ్స్క్రిప్షన్ ఇస్తామని ఇంతకుముందే ఎలన్ మస్క్ ప్రకటించారు. తాజా నిర్ణయం ప్రకారం బ్లూ సబ్ స్క్రిప్షన్ పొందిన వారికి మాత్రమే ట్వీట్ డెక్ సర్వీసులు లభిస్తాయి.
బుధవారం ట్వీట్ డెక్ సర్వీసు కోసం ప్రయత్నిస్తున్న వారందరికీ ‘పేవాల్ (Paywall)’ ప్రత్యక్షమవుతున్నది. అంటే మనీ పే చేసిన వారికి బ్లూ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అలా బ్లూ సబ్స్క్రిప్షన్ పొందిన వారికి మాత్రమే ట్వీట్ డెక్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాల నిర్వహణకు డాష్ బోర్డ్ అప్లికేషనే ‘ట్వీట్ డెక్’. గతంలో థర్డ్ పార్టీ సర్వీసుగా ఉన్న ట్వీట్ డెక్’ను 2011లో ట్విట్టర్ కొనుగోలు చేసింది. ట్వీట్ డెక్ పేరు కూడా గత నెల మూడో తేదీన ఎక్స్ప్రో (XPro)గా మారుస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.
ఎక్స్ (ట్విట్టర్)లో బ్లూ సబ్ సబ్ స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ.650.. ఏడాదికైతే రూ.6800 పే చేయాలి. అలా బ్లూ సబ్ స్క్రిప్షన్ పొందిన వారు 25వేల అక్షరాలు గల సుదీర్ఘమైన పోస్టులు పెట్టొచ్చు. ఫుల్ హెచ్ డీ వీడియోలో అప్ లోడ్ చేయొచ్చు. ట్వీట్లు ఎడిట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటది. నెటిజన్లు సెర్చింగ్ చేస్తున్నప్పుడు ‘ట్వీట్ డెక్’లో పోస్టులు టాప్ చూపెడతారని వెల్లడించింది. పెయిడ్ సర్వీస్ ‘బ్లూ సబ్ స్క్రిప్షన్’లోకి వీలైనంత ఎక్కువ మందిని తీసుకొచ్చి ఆదాయం పెంచుకోవడానికి ఎలన్ మస్క్ ఎత్తు వేశారని నెటిజన్లు అంటున్నారు.