Stock Market | ముంబై, మార్చి 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను మూడుసార్లు తగ్గించనుందన్న అంచనాలు.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఉదయం ఆరంభం నుంచీ సూచీలు పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 539.50 పాయింట్లు లేదా 0.75 శాతం ఎగిసి 72,641.19 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 780.77 పాయింట్లు పెరిగింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 172.85 పాయింట్లు లేదా 0.79 శాతం ఎగబాకి 22వేల స్థాయికి ఎగువన 22,011.95 వద్ద స్థిరపడింది. బుధవారం మార్కెట్లు లాభాల్లోనే ముగిసిన విషయం తెలిసిందే.
స్టాక్ మార్కెట్ల ర్యాలీతో ఈ ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.5.72 లక్షల కోట్లు ఎగబాకింది. రూ.5,72,752.79 కోట్లు అందిపుచ్చుకుని రూ.3,79,85,669.12 కోట్లకు చేరింది.