న్యూఢిల్లీ, మే 4: యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే 2200 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో జరిగిన 1,789 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 25 శాతం పెరిగాయని పేర్కొంది. కానీ, మార్చి నెలలో రికార్డు స్థాయి 2,264 కోట్ల లావాదేవీలతో పోలిస్తే తగ్గాయి. ఇప్పటి వరకు ఇదే చారిత్రక గరిష్ఠ స్థాయని తన ఎక్స్లో వెల్లడించింది.
యూపీఐ లావాదేవీలపై రిజర్వుబ్యాంక్ పలు భద్రత ఫీచర్లను పాటిస్తుంది. మొదటిది యూజర్లకు సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలను మొబైల్ నంబర్తో లింక్డ్ చేయడం, యూపీఐ పిన్, లావాదేవీలను వెనువెంటనే పూర్తయ్యే విధంగా టెక్నాలజీని ఆధునీకరించడం కూడా లావాదేవీలు పెరుగడానికి కారణమని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో 85 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి.