UPI Frauds | దేశంలో ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు పుంజుకున్నాయి. డిజిటల్ చెల్లింపుల కోసం 2016లో యూపీఐ సేవలను ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో రికార్డు స్థాయిలో తొలిసారి 500 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.పలు ఆర్థిక సంస్థలు, ప్రజలు, బహుళ వాటాదారులు పదేపదే యూపీఐ ద్వారా చెల్లింపులు చేపట్టారు. యూపీఐ చెల్లింపుల సంఖ్యతోపాటు మోసాల రిస్క్ కూడా వెంటాడుతూనే ఉంటుంది. పలు యూపీఐ ఆధారిత స్కామ్లు ఇటీవల పతాకశీర్షికలకెక్కాయి.
ఇటువంటి మోసాల నుంచి బయట పడేందుకు ప్రతి యూపీఐ యూజర్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. సురక్షితంగా యూపీఐ చెల్లింపులు లేదా పేమెంట్స్ పొందడానికి ఐదు టిప్స్ వాడాలని అంటున్నారు.
గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తే.. దాని గురించి మీకు తెలియకపోతే దానిపై చాటింగ్ వంటి ఎటువంటి చర్చ జరుపవద్దు. ప్రత్యేకించి వెబ్సైట్ల సోర్స్ నుంచి షేర్ చేసే ఫోన్ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
చాలా మంది యూజర్లు తమకు వచ్చిన మెసేజ్లో పిన్ నంబర్ షేర్ చేయమని ఉందని.. తర్వాత మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. మీ బ్యాంకు శాఖ అధికారులు నగదు పొందడానికి పిన్ నంబర్ చెప్పాలని ఎప్పుడూ కూడా అడుగదు. మోసగాళ్లు మీకు డబ్బు పంపాలంటే పిన్ నంబర్ మెసేజ్ చేయాలనే టెక్నిక్ వాడుతుంటారు. ఇటువంటి వారి వలలో పడొద్దు.
అత్యధిక యూపీఐ యాప్స్ కూడా స్పామ్ ఫిల్టర్ కలిగి ఉంటాయి. కొన్ని నిర్దిష్ట యూపీఐ ఐడీల ద్వారా పేమెంట్ రిక్వెస్ట్లను ట్రాక్ చేయొచ్చు. అటువంటి ఐడెంటిఫికేషన్ ద్వారా వస్తే యూజర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవతలి వ్యక్తి ఫ్రాడ్ కాదని 100 శాతం నమ్మితేనే ట్రాన్సాక్షన్ చేపట్టాల్సి ఉంటుంది.
పలు యూపీఐ యాప్లు వివిధ బ్యాంకుల్లో ఖాతాదారుల వ్యక్తిగత డిటైల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. యూపీఐ ద్వారా మనీ పే చేయడానికి గానీ, పొందడానికి గానీ వ్యక్తిగత సమాచారం కావాలని అడుగుతుంటాయి. బ్యాంకు యాప్లను పోలిన నకిలీ యాప్లు ఉంటాయి. ఒకవేళ మీరు ఫేక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ వ్యక్తిగత సమాచారం ఫ్రాడ్స్టర్లకు చేరిపోతుంది. అప్పుడు మోసగాళ్లు తేలిగ్గా మీ ఖాతా నుంచి నగదు దొంగిలించేస్తారు.